సారీ, అమ్మా: విద్యార్థిని ఆత్మహత్య, ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయలేదు
Recommended Video
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఫీజు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యం ఆమెను పరీక్ష రాయనీయలేదు. దాంతో మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయి దీప్తి ఆత్మహత్య చేసుకుంది.
గురువారం సాయంత్రం మల్కాజిగిరిలోని తమ ఇంట్లో సాయి దీప్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను పరీక్ష రాయనీయకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది.
"వాళ్లు నన్ను పరీక్ష రాయనీయలేదు. సారీ మామ్" అని అందులో రాసింది. ఫీజు చెల్లించకపోవడంతో తనను తరగతి గది బయట నిలబెట్టారని సాయిదీప్తి ఇంటికి వచ్చిన తర్వాత తన సోదరికి చెప్పింది.
ఇతర విద్యార్థుల ముందు ఫీజు కట్టలేదని టీచర్ తనను అవమానించారని తనతో చెప్పినట్లు సాయి దీప్తి అక్క చెప్పింది. పాఠశాలలో జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె అన్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.