తెలంగాణకు శుభవార్త వినిపించిన కేంద్రం
తెలంగాణకు కేంద్రం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్ల పనులు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పాత స్టేషన్ల పునరుద్ధరణ వంటివి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త రైల్వే లైను కోసం సర్వే జరుగుతోంది. తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త లైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలు పరుస్తారు.
జరుగుతున్న సర్వే పనులు
ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నర వ్యవధిలోనే తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి వీలుపడుతుంది. ఈ మార్గంలో రైల్వే లైను ఏర్పాటు చేయాలంటూ వ్యాపారస్తుల నుంచి కొంతకాలంగా డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగానే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే పనులు ప్రారంభింపచేశారు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గం వికారాబాద్ మీదుగా నిర్మించారు. దీనివల్ల తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి 104 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి మూడు గంటల సమయం పడుతోంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే గంటన్నరలోనే జహీరాబాద్ చేరుకోవచ్చు.

కందులను రవాణా చేసుకోవచ్చు
తాండూరులో పండే కందులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వీటిని దేశం నలుమూలలకు రవాణా చేయడంద్వారా రైల్వేకు కూడా ఆదాయం భారీగా వస్తుంది. వీటితోపాటు అనేక పరిశ్రమలకు ఆలవాలంగా తాండూరు ఉంది. వీటికి అవసరమైన వాటిని రవాణా చేయడంద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం సమకూరుతోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి రాబోతోంది. కొంతకాలంగా భారతీయ రైల్వే కొత్త మార్గాలపై దృష్టిపెట్టింది. సరకు రవాణాద్వారా అధిక ఆదాయం సమకూరే ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసుకుంటోంది. పారిశ్రామికంగా అవసరాలు తీర్చడం కోసం రైల్వే లైను నిర్మించడంతో అది ప్రజా రావాణాకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో రైల్వే ఉంది.












Click it and Unblock the Notifications