సౌత్ ఇండియా టెంపుల్ రన్.. తక్కువధరకే ఐఆర్సీటీసి విమాన ప్యాకేజీ!
ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చే ఐఆర్సీటీసీ తాజాగా మరో శుభవార్త చెప్పింది సౌత్ ఇండియా టెంపుల్ రన్ పేరుతో దివ్య దక్షిణ యాత్రకు సంబంధించి విమాన యాన ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులు, ఆధ్యాత్మిక యాత్రికుల అవసరాలకు అనుగుణంగా టూర్ ప్లాన్ చేస్తున్న ఐఆర్సిటిసి తాజాగా తీసుకువచ్చిన సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ విశేషాలు మీకోసం.
ఐఆర్సిటిసి తన ప్రత్యేక ప్యాకేజీల ద్వారాప్రయాణికులకు సేవలు
దేశీయ, అంతర్జాతీయ పర్యటనలను రూపొందిస్తున్న ఐఆర్సిటిసి తన ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ప్రయాణికులకు మెరుగైన టూరింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రవాణా, వసతి, భోజన సదుపాయాలతో కూడిన పూర్తి సేవలతో ఐఆర్సిటిసి అందరి మనసులను గెలుచుకుంటుంది. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావించేవారికి విభిన్న ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వస్తుంది.

సౌత్ ఇండియా టెంపుల్ రన్ విమాన ప్యాకేజీ
దక్షిణ భారతదేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను తక్కువ సమయంలో సందర్శించే విధంగా సౌత్ ఇండియా టెంపుల్ రన్ విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.ఇందులో మధురై ,కన్యాకుమారి, తిరుచ్చి, త్రివేండ్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది .మొత్తం ఆరు రాత్రులు ఏడు పగళ్ళు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా ప్రముఖ తమిళనాడు క్షేత్రాలను చాలా తక్కువ ధరకే దర్శించుకోవచ్చు.
హైదరాబాద్ నుండి విమానం బయలుదేరటంతో యాత్ర ప్రారంభం
దీని టిక్కెట్ ధరలు 37,700 రూపాయల నుండి మొదలవుతాయి. ఆగస్టు 16వ తేదీన ఉదయం 6 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ నుండి విమానం బయలుదేరడంతో యాత్ర ప్రారంభం అవుతుంది. తొలిరోజు త్రివేండ్రం చేరుకుని అక్కడ కేటాయించిన హోటల్లో బస చేసి పువార్ ఐలాండ్, అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. హోటల్లో రాత్రి భోజనంతో పాటు బస కూడా ఉంటుంది.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం, కన్యా కుమారి సందర్శన
రెండవ రోజు అనంత పద్మనాభ స్వామి దేవాలయం సందర్శించి, ఆ తర్వాత కన్యాకుమారికి చేరుకుంటారు. అక్కడ సూర్యాస్తమయాన్ని వీక్షించి, తిరిగి రాత్రి బసచేస్తారు. అక్కడే భోజన వసతి కూడా ఉంటుంది. మూడవరోజు కన్యాకుమారికి సమీపంలోని రాక్ మెమోరియల్, తిరువళ్ళువర్ విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి రామేశ్వరంలో బస చేస్తారు.
రామేశ్వరం, ధనుష్కోటి ఆలయాల సందర్శన
నాలుగో రోజు రామేశ్వరం, ధనుష్కోటి ఆలయాలను సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న ఆలయాలన్నీ సందర్శించి, తిరిగి రాత్రికి రామేశ్వరంలోనే బస చేస్తారు. ఐదవ రోజు అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శిస్తారు. ఆపై తంజావూర్ కి వెళతారు. అక్కడ బృహదీశ్వరాలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుండి తిరుచ్చి కి బయలుదేరుతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.ఆరవ రోజు శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి మధురై ప్రయాణమవుతారు.
తిరిగి మధురై ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కు
మధురైలో షాపింగ్ చేసుకునే వీలుంటుంది. ఆ రోజు రాత్రికి మధురై లోనే బస ఉంటుంది. ఏడవ రోజు మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆపై మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మధురై ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కు ప్రయాణమవుతారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోవడంతో సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజ్ ముగుస్తుంది.













Click it and Unblock the Notifications