తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు: 3 రోజులపాటు వానలే వానలు
హైదరాబాద్: ఎండతీవ్రత, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఇది చల్లని కబురు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని.. రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో బుధవారం కురిసిన వర్షంతో నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. మరోవైపు, గురువారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. యాదాద్రిలో భారీ వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాలు, కార్లు వర్షపు నీటిలో దాదాపు మునిగిపోయాయి. రోడ్లపై కూడా వరదనీరు ప్రవహించింది.

ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలు.. బుధవారం నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటం, చల్లని వాతావరణంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఆకాశం మేఘావృతం కావడంతో.. ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. దీనితో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా చల్లబడిపోయింది.
కాగా, రానున్న మూడు రోజులపాటు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటి సాగుకు సమాయత్తమవుతున్నారు. రుతుపవనాల రాకతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications