Monsoons: జూన్ 6 తర్వాత రాష్ట్రంలోకి రుతుపవనాలు..!
భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. ఈసారి ముందుగానే రుతుపవనాలు వస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాలు మే 19 న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. కేరళను రుతుపవనాలు మే 31 న తాకే అవకాశం ఉంది. "నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది మే 31న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది" అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
జూన్ 6 తర్వాత తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అప్పుడే భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ కూడా జూన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాధారణ వర్షపాతం 615.4 మిమీ కాగా గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో 769.5 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదైంది. నగరం మొత్తం మీద 'అదనపు' వర్షపాతం నమోదైతే, కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్లోని మండలాల్లో షేక్పేట, మారేడ్పల్లి, చార్మినార్, ఆసిఫ్నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి మండలాల్లో నగర సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 19 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది రుతుపవనానికి ముందు కురిసే వర్షమే అయినప్పటికీ, వేసవి కాలంలో నగరంలో ఉండే తీవ్రమైన వేడి నుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications