వందకు పైగా టీమ్లతో.. 'డిసెంబర్ 31' రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10గం.ల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీసీపీ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు.
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు దేశమంతా సన్నద్దమవుతున్న తరుణంలో.. మందుబాబుల ఆగడాలు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10గం.ల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీసీపీ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు.
కొత్త సంవత్సరం సందర్బంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా డీసీపీ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరమంతా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని, వందకు పైగా టీమ్ లు ఈ తనిఖీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీలను వీడియో తీయనున్నట్టు తెలియజేశారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడేవారిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదై ఉంటే వారిని జైలుకి పంపిస్తామని అన్నారు.
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడేవారి వివరాలు ఆధార్ ద్వారా జాబ్ వెరిఫికేషన్, వీసా, పాస్ పోర్టు వంటివాటిల్లో పొందుపరుస్తామని చెప్పారు. కొత్త ఏడాదిని అందరు సంతోషంగా జరుపుకోవాలని, వాహనదారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని హితవు పలికారు.