హైదరాబాద్ బుక్ ఫెయిర్: పవన్ కళ్యాణ్ హటావో రచయితకు ప్రత్యేక భద్రత
హైదరాబాద్: పవన్ కల్యాణ్ హటావో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్కు ప్రభుత్వం పోలీస్ భద్రతను కల్పించింది. సికింద్రాబాదులోని తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 18-27వరకు జరిగే హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టాల్లో పవన్ కల్యాణ్ హటావో పుస్తకాలు అమ్మకానికి పెడుతున్నారు. దీంతో ఆయనకు ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరవుతారని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్ తెలిపారు. మధ్యాహ్నం హైదరాబాద్ ఎన్టీఆర్ మైదనాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
శుక్రవారంప్రారంభమయ్యే ప్రదర్శన రోజు రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు జరుగుతుందని, ప్రభుత్వ సెలవు రోజుల్లో 12 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశ రుసుం లేదన్నారు. ఈ ఏడాది సభ ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు, అలాగే సభా వేదికకు సుద్దాల హనుమంతు వేదికగా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.
బుక్ ఫెయిర్కి వచ్చేందుకు ఐదు ద్వారాలు ఏర్పాటు చేసామని వాటికి మగ్దూమ్, సదాశివ, షోయబుల్లా ఖాన్, దాశరథి రంగాచార్య, చిత్త ప్రసాద్ పేర్లు పెట్టామన్నారు. రోజూ విద్యార్థుల కోసం కథలు,వ్యాసరచన, చిత్రలేఖనంపోటీలు నిర్వహించనునట్లు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 371 బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసామని వాటిలో 271 స్టాల్స్ కేవలం ఇంగ్లిష్, తెలుగు,హిందీ భాషాలకు చెందినవని ఫెయిర్ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ చెప్పారు.
19వ తేదీన బుక్ ఫెయిర్ చేపట్టనున్న కార్యక్రమాల క్యాలెండర్ ఆవిష్కరిస్తామని, బుక్ ఫెయిర్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, గద్దర్, అందెశ్రీ, గోరెటి వెంకన్న, అంజన్న పాల్గొంటారన్నారు.