తిరుపతి, షిర్డీకి ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి నుంచి 38స్పెషల్- రూట్, షెడ్యూల్..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరుగుతున్న వేసవి రద్దీకి అనుగుణంగా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతితో పాటుగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం కు ఈ రైళ్ల ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్న రూట్లలో స్పెషల్ రైళ్లు కొనసాగుతున్నాయి. కాగా, ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా తాజాగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు. వేసవి స్పెషల్ రైళ్ల షెడ్యూల్ .. రూట్ ను అధికారులు ప్రకటించారు.
తిరుపతికి ప్రత్యేక రైలు
వేసవిలో తిరుపతికి వెళ్లే రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో, ప్రయాణికుల సౌకర్యార్థం మచిలీపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. 07121 నంబర్ ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి మే 25 వరకు తిరుపతిలో రాత్రి 10:20 గంటలకు బయల్దేరుతుందని చెప్పారు. అర్ధరాత్రి 4:30 గంటలకు విజయవాడ, 7:20కి మచిలీపట్నం చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14 నుంచి మే 26 వరకు ఇదే రైలు 07122 నంబరుతో మచిలీపట్నంలో సాయంత్రం 5:40 గంటలకు బయల్దేరి తెల్లవారుజాము 3:20 గంటలకు తిరుపతి చేరుతుంది.

షిర్డీ రైలు పొడిగింపు
కాగా, ఈ రైలు మార్గ మధ్యలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వివరించారు. ఇక.. ఇదే సమయంలో అధికారులు మరో ప్రకటన చేసారు. చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్డు మధ్య మొత్తం 24 సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు రైలు (07025); ఏప్రిల్ 12వ తేదీ నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి (07026) మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. దీంతో పాటు తిరుపతి- సాయినగర్ శిర్డీ మధ్య నడిచే 07637/07638 ప్రత్యేక రైళ్లను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
రద్దీకి అనుగుణంగా
కాగా, చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వారంలో రెండు రోజుల చొప్పున అదనంగా వీటిని నడపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సర్వీసులు మే 31 వరకు నడవను న్నాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇక.. ప్రధానంగా తిరుపతి, షిర్డీకి పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. మే నెలాఖరు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications