కాకతాళీయమా... వ్యూహమా-కేసీఆర్ ఢిల్లీ టూర్తో ఈటల కలవరం?-రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కలవరపరుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ,కేంద్రమంత్రులతో అప్పటికప్పుడు అపాయింట్మెంట్ సంపాదించి వారితో వరుసగా భేటీ అవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని ద్వారా కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏ సంకేతాలివ్వదలుచుకున్నారనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ అని కాంగ్రెస్ తొలి నుంచి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆ విమర్శలకు బలం చేకూర్చేలా మారింది.

కాకతాళీయమా... కేసీఆర్ వ్యూహమా...
ఇటీవల పశ్చిమ బెంగాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు,ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. హుజురాబాద్ ఉపఎన్నిక మాత్రం దసరా తర్వాతే ఉంటుందని తెలిపింది.కోవిడ్ కారణంగా ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక నిర్వహించట్లేదని పేర్కొంది. అయితే బెంగాల్,ఒడిశాల్లో ఉపఎన్నికలకు అడ్డురాని కోవిడ్ హుజురాబాద్ ఉపఎన్నికకే అడ్డు వచ్చిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్లో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం మరింత చర్చకు దారితీసింది. ఇది కేసీఆర్ వ్యూహమా... లేక కాకతాళీయమా అనే చర్చ జరుగుతోంది.

ఈటలకు ప్రతికూలంగా పరిణామాలు...
సాగు చట్టాల అంశం మినహా కేసీఆర్ బీజేపీని పెద్దగా వ్యతిరేకించిన దాఖలా లేదు. మొదట్లో వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకించినప్పటికీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించిన వ్యక్తి... మళ్లీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఒకరకంగా రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కేంద్రంలో ఆ పార్టీతో సఖ్యతగా ఉంటున్నారనే సంకేతాలు పంపించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా ఢిల్లీ టూర్ అందుకు బలాన్ని చేకూర్చేలా ఉంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లాకే ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోరడం... వెనువెంటనే వారితో భేటీ అవడం జరిగాయి. ఈ పరిణామాలు మాజీ మంత్రి ఈటలకు ఒకింత ప్రతికూలంగా మారాయనే వాదన వినిపిస్తోంది.

ఉపఎన్నిక వాయిదా వ్యూహాత్మకమేనా...
బీజేపీ అయితేనే కేసీఆర్ను గట్టిగా ఎదుర్కోగలమని భావించి ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు,అందుకు కేంద్ర పెద్దలు సహకరిస్తున్న తీరు ఆయనకు మింగుడుపడటం లేదు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య దోస్తీ ఉందనే ప్రచారం కేసీఆర్ ఢిల్లీ టూర్తో మళ్లీ ఊపందుకుంది. ఇరువురి అవగాహన మేరకే హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇరు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకునే ఒప్పందంలో భాగంగానే ఉపఎన్నికను వాయిదా వేయించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ప్రజల్లోకి ఏ సంకేతాలు పంపిస్తుందో...
హుజురాబాద్పై కేసీఆర్ ఫోకస్ చేసిన తీరు చూసి అక్కడ టీఆర్ఎస్కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరిగింది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడం,నియోజకవర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం,సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తుండటం... ఇవన్నీ చూసి కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు వినిపించాయి. ఇప్పటికిప్పుడు ఉపఎన్నిక జరిగితే టీఆర్ఎస్కు నష్టం జరగవచ్చుననే విశ్లేషణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఉపఎన్నికను కొంతకాలం వాయిదా వేయడం ద్వారా ఈటల హవాకు చెక్ పెట్టే వ్యూహానికి తెరలేపారనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు బీజేపీ నేతలకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ను గందరగోళంలోకి నెట్టాయి. బీజేపీ అయితేనే కేసీఆర్ను ఎదుర్కోవచ్చుననే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరితే... అదే పార్టీతో కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతుండటం,కేంద్ర పెద్దలు సైతం ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తుండటం... ఇవన్నీ ప్రజల్లోకి తన పట్ల ప్రతికూల సంకేతాలు పంపిస్తాయేమోనన్న ఆందోళన ఈటలను వెంటాడుతోంది.

బండి సంజయ్ ఉత్సాహాన్ని నీరుగార్చేలా...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పదేపదే చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆ దిశగా ఇటీవలే పాదయాత్ర ప్రారంభించారు.పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కేసీఆర్,ఆయన ఫ్యామిలీని జైలుకు పంపిస్తామని గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఓవైపు సంజయ్ ఎటాకింగ్ మూడ్లో ఉంటే కేంద్ర పెద్దలు కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నారు.
Recommended Video

కేసీఆర్తో దోస్తీ... బీజేపీకి ఏం అవసరం?
ఇప్పటికిప్పుడు కేసీఆర్ను దగ్గర తీయాల్సిన అవసరం బీజేపీకి ఏముందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందనే విశ్లేషణల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో సఖ్యతకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండాలని ఆ పార్టీ భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు భవిష్యతే సమాధానం చెప్పనుంది. ఒకవేళ అదే నిజమైతే ఈటల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. తాజా పరిణామాలపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆధిపత్య వర్గాల నాయకులు కుర్చీ కోసం,ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. పాపం సంగ్రామ సంజయ్కి మహాభారతం,ఈటలకు మహాప్రస్థానం పూర్తిగా అర్థమైనట్లు లేదు.' అని వ్యాఖ్యానించడం గమనార్హం.












Click it and Unblock the Notifications