అక్రమ కట్టడాల కూల్చివేత: స్పీడు పెంచమన్న మేయర్, కమిషనర్
గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి గురువారం సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లోని నాలాలపై ఆక్రమణల కూల్చివేత అంశంపై గురువారం వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టు విభాగం ఇంజనీర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు.
హైదరాబాద్ లోని నాలాలపై అడ్డంకిగా మారిన 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు. గత నెల నుంచి కొనసాగుతున్న కూల్చివేతల్లో భాగంగా ఇప్పటివరకు 93 అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు అధికారులు చెప్పారు.
అక్రమ నిర్మాణదారులకు విధిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని అధికారులను మేయర్, కమిషనర్ ఆదేశించారు. నాలాల విస్తరణ సందర్భంగా ఇళ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు కేటాయించడానికి, నగరంలో జేఎన్ఎన్ యూఆర్ఎం, వాంబే పథకాల నిమిత్తం నిర్మించిన రెండు వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.