పేదల తిరుపతిలో ఉత్సవాల జోరు
పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానఘట్టమైన ఉద్దాలు( పాదుకల)ఉత్సవం వైభవంగా సాగింది. రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక,మహరాష్ట్ర నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కురుమూర్తి పోటెత్తింది. సాంప్రదాయం ప్రకారం స్వామిపాదుకలు తయారు చేసిన వడ్డేమాన్ లోని కర్మాగారం వద్ద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉరేగింపు ప్రారంభమైంది.
ప్రత్యేక వాహానంలో అక్కడి నుంచి వివిధ గ్రామాల మీదుగా జాతరమైదానికి చేరుకునే సరికి రాత్రి అయ్యింది. దారివెంట గ్రామాల ప్రజలు పాదుకలను చూసేందుకు, వాటిని తాకేందుకు పోటీపడ్డారు. భారీగా భాణసంచా కాల్చారు. భక్తుల గోవిందనామస్మరణతో కురుమూర్తి గిరులు మారుమ్రోగాయి. భక్తులు దాసాంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరమైదానంలో భక్తుల పూనకాలు, నెమలి పించాలు చేతబూని సంప్రదాయబద్దంగా చేసిన నృత్యాలు అలపించారు.
ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దయాకర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్వ మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఉద్దాలు గుట్టపైకి చేరిన తర్వాత వాటిన దర్శించుకుని స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.