షాక్: కాపీ కొడుతూ పట్టుబడి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి
కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడిన ఓ పదో తరగతి విద్యార్థి ఆ అవమాన భారం తట్టుకోలేక పాఠశాల భవనం పైనుంచి దూకేశాడు.
హైదరాబాద్: కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడిన ఓ పదో తరగతి విద్యార్థి ఆ అవమాన భారం తట్టుకోలేక పాఠశాల భవనం పైనుంచి దూకేసిన ఘటన సోమవారం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కంచన్ బాగ్ లోని విద్యాదాయిని మోడల్ హై స్కూల్ లో సన్నీత్ రెడ్డి(15) పదో తరగతి పరీక్ష రాస్తున్నాడు. సోమవారం పరీక్ష రాస్తుండగా అతడు కాపీయింగ్ కు పాల్పడడంతో ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఆన్సర్ షీట్ తీసేసుకుని పరీక్ష హాలులోంచి బయటికి పంపించేశాడు.
ఇది అవమానంగా భావించిన సన్నీత్ రెడ్డి మూడో అంతస్తు కారిడార్ నుంచి కిందికి దూకేశాడు. పాఠశాల సిబ్బంది గమనించి హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం సన్నీత్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజిలను పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.