చేప ప్రసాదం పంపిణీ, బారులు తీరిన జనాలు: 133 ప్రత్యేక బస్సులు
Recommended Video
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఆస్తమా కోసం బత్తిని గౌడ్ సోదరులు పంపిణీ చేయనున్న చేప ప్రసాదం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఇది ప్రారంభమైంది. శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది. చేప ప్రసాదం కోసం బెంగాల్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇప్పటికే ప్రజలు బారులు తీరారు.
ఈసారి లక్షన్నర మందికి పైగా చేప ప్రసాదం స్వీకరించేందుకు రావొచ్చని అంచనా. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సులను ఎగ్జిబిషన్ మైదానం వరకు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
ప్రసాద వితరణ కోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో వీఐపీలకు ఒకటి, వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం మరో కౌంటర్ను కేటాయించారు. క్యూలైన్లలో ఒత్తిడిని నివారించడంలో భాగంగా టోకెన్ల విధానాన్ని అమలు చేస్తారు. టోకెన్ల కోసం ప్రత్యేకంగా 34 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో వచ్చేవారికి 30, ఎగ్జిబిషన్ మైదానంలోని వారికి మరో 2 మొబైల్ టోకెన్ కౌంటర్లను సిద్ధం చేస్తారు.
మత్స్యశాఖ 1.30 లక్షల చేపపిల్లలను అందుబాటులో ఉంచుతుంది. బందోబస్తు కోసం 1500 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. 70 సీసీ కెమెరాలతో నిఘా. మైదానంలో అంతటా చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తారు. మైదానంలో ఉన్న 100 శాశ్వత మరుగుదొడ్లకు అదనంగా 100 మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
13 చోట్ల వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించారు. ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిరంకారి, ఎన్సీసీ, బ్రహ్మకుమారీలు, స్థానిక యువతతో దాదాపు 800 మందిని వలంటీర్లుగా నియమించారు. తప్పిపోయినవారిని సంబంధీకుల వద్దకు చేర్చడానికి మే ఐ హెల్ప్ యూ డెస్క్లనుచేస్తున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా 7, 8 తేదీల్లో రూ.5 అన్నపూర్ణ భోజన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులో 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు. క్యూలైన్లలో 75 మందితో ప్యాకెట్లను పంపిణీ చేస్తారు.