సదరం శిబిరంలో తొక్కిసలాట: వృద్ధుడి మృతి
మహబూబ్నగర్: జిల్లాలోని వనపర్తిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ధృవీకరణ పత్రం కోసం వచ్చిన ఖిల్లా ఘనపురం మండలం బలిజేపల్లికి చెందిన జనార్ధనరెడ్డి(62) మృతి చెందాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
కాగా, వృద్ధుడు మరణించిన ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని స్పందించారు. స్వయంగా సదరం శిబిరాన్ని సందర్శించారు. శిబిరం నిర్వహణ, అధికారుల తీరుపై బాధితులు కలెక్టర్ను నిలదీశారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని కలెక్టర్ వారికి తెలిపారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త
ఖమ్మం: జిల్లాలోని గుండాల మండలం మామకన్ను గ్రామంలో ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురు రైతుల ఆత్మహత్య
తెలంగాణ జిల్లాల్లో బుధవారం ముగ్గు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దీపకుంటలో బొబ్బిలి వెంకటరెడ్డి అనే రైతు పదెకరాల పత్తి పంట ఎండిపోయిందనే మనస్తాపంతో, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దామరచర్ల మండలం కల్లెపల్లిలో మాలోతు రవి అనే రైతు మిరప చేనులో పరుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పత్తి, మిరప పంటలు ఎండిపోయాయని మనస్తాపంతో రవి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో మధురయ్య అనే రైతు విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోయిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 3ఎకరాల భూమిలో వరి సాగుకోసం రూ. లక్ష అప్పు చేసిన మధురయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.