ఇక జోరు: మోడీ, రాహుల్, కేసీఆర్, చంద్రబాబు వరుస ప్రచారం, ఆ రోజు అందరూ ఒకేచోట!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో దాదాపు మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత జోరందుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలికి బలపం పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, రేవంత్ రెడ్డిలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, మజ్లిస్, ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
బీజేపీ, కాంగ్రెస్ల తరఫున అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేంద్రమంత్రులు, జాతీయస్థాయి నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నుంచి ప్రచారం మరింత వేడెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 27న, డిసెంబర్ 3న, రాహుల్ గాంధీ నవంబర్ 29న, ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 28, 29న ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్లు వస్తున్నారు.
ప్రధాని బహిరంగ సభలు
డిసెంబర్ 3వ తేదీన ఒకేరోజు ముగ్గురు కీలక నేతల మహాసభలు ఉన్నాయి. మంగళవారం (నవంబర్ 27) ప్రధాని మోడీ నిజామాబాద్, మహబూబ్ నగర్ బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు. నిజామాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకు, మహబూబ్ నగర్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన కేంద్ర పథకాలతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏవిధమైన పాలన ఉందో చెప్పనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటులో తమ కృషి చెప్పనున్నారు. అందుకే సుష్మా స్వరాజ్ కూడా ప్రచారానికి వస్తున్నారు. నాడు తెలంగాణ రావడంలో తెరాస, ఇతర పార్టీలు, ఉద్యమకారులు పోరాడితే, తెలంగాణ ఆకాంక్ష నెరవేరడంలో సోనియాతో పాటు సుష్మాస్వరాజ్ పేరు వినిపిస్తుంది. అందుకే సుష్మాను చిన్నమ్మ అంటున్నారు.
చంద్రబాబు, రాహుల్ గాంధీ రోడ్డు షో
రాహుల్ గాంధీ మేడ్చల్ సభలో సోనియాతో పాటు పాల్గొన్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా మళ్లీ వస్తున్నారు. 29న చంద్రబాబుతో కలిసి రోడ్డు షో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో తమ పార్టీ పాత్ర, నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో లోపాలను ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు కూడా ప్రచారంలో కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించనున్నారు. అలాగే కూటమి విజయం ఆవశ్యకతను చెప్పనున్నారు.
మరో రెండుసార్లు అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నవంబర్ 28వ తేదీన, డిసెంబర్ 2వ తేదీన మరో రెండుసార్లు రానున్నారు. రాహుల్ గాంధీ నవంబర్ 29న పరిగి, చేవెళ్లలలో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఇక తెరాస అధినేత కేసీఆర్ ఎలాగు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్.
నలుగురు కీలక నేతలు
డిసెంబర్ 3వ తేదీన నలుగురు కీలక నేతలు గ్రేటర్ హైదరాబాదులో ప్రచారం చేయనున్నారు. ఆ రోజు ప్రధాని మోడీ నగరంలో సభకు హాజరు కానున్నారు. జిల్లాల్లో ప్రచారం చేస్తున్న కేసీఆర్ అదే రోజున హైదరాబాదులో ప్రచారం చేస్తారు. మరోవైపు రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ రోజు (నవంబర్ 27) మోడీ, కేసీఆర్ల సభలు మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఇది పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.