వెంకయ్యా! బాబుని పొగడటం ఆపు, జగన్కేమైనా అయితే: విహెచ్ హెచ్చరిక
హైదరాబాద్: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పొగడటం మానివేసి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను విరమింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు సోమవారం డిమాండ్ చేశారు.
వెంకయ్య ఇప్పటికైనా చంద్రబాబు భజన మానాలన్నారు. జగన్కు ప్రత్యేక హోదా పైన బిజెపి హామీ ఇవ్వాలని, తద్వారా ఆయన దీక్షను విరమింప చేయాలన్నారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించారు. ఆరెస్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, బిజెపి అది చెప్పినట్లే చేస్తుందన్నారు.
కండూరు తెలంగాణ శ్రీశైలం : స్వామిగౌడ్
మహబూబ్నగర్ జిల్లాలోని కండూరు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ శ్రీశైలంగా తీర్చిదిద్దుతామని మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు.
ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ ద్వారా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రజలకు స్వచ్ఛమైన కల్లు పోసి గీత కార్మికులు తమ వృత్తిని కాపాడుకోవాలన్నారు. అన్ని కులవృత్తులు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు.
కెసిఆర్ను కలిసిన దత్తాత్రేయ
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం నాడు కలిశారు. మరోవైపు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు.
కెసిఆర్ పైన మండిపడ్డ టిటిడిపి నేతలు
కెసిఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ సాధ్యం కావడం లేదన్నారు. రుణాలపై బ్యాంకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయన్నారు. బ్యాంకుల పైన ఒత్తిడి తెచ్చేందుకు రేపు అన్ని బ్యాంకుల వద్ద ధర్నా చేస్తామన్నారు.
రైతాంగానికి తాము అండగా ఉండామని చెప్పారు. రైతుల సమస్యల పైన ఈ నెల 14న గవర్నర్, 15, 16వ తేదీల్లో కేంద్రమంత్రులు, రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69 గందరగోళంగా ఉందన్నారు. రుణమాఫీ పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
బిజెపిని వీడను, టిడిపిలో చేరను: నాగం
బీజేపీని వీడి తాను టీడీపీలో చేరుతానన్న వార్తల్లో నిజంలేదని నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ ఊహాగానమేనన్నారు. పార్టీలో స్వేచ్ఛగానే కొనసాగుతున్నానన్నారు. ఢిల్లీలోకేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు.
హోంమంత్రి ఆహ్వానం మేరకు తాను ఢిల్లీకి వచ్చానన్నారు. తాను ప్రారంభించిన బచావా తెలంగాణ మిషన్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్న విషయాన్ని రాజ్నాథ్కు వివరించానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై చర్చించామన్నారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు తాను రైతు యాత్ర చేశానన్నారు.