మాటల యుద్ధం మానండి.!రైతును ఆదుకోంది.!బీజేపి,టీఆర్ఎస్ పార్టీలకు అఖిలపక్షం హితవు.!
హైదరాబాద్ : వడ్ల కొనుగోలు విషయమై కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి, ఇటు రాష్ట్రంలో పాలన చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి మధ్య సాగుతున్న మాటల యుద్ధం వలన రాష్ట్ర రైతాంగా అనేక సమస్యల్లో కూరుకుపోతున్నాడని అఖిల పక్ష నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపి, టీఆర్ఎస్ పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు రైతులకు నష్టం చేస్తున్నాయని, ఆబోతులు కొట్లాడితే లేగల కాళ్ళు విరిగినట్టు ఇరు పార్టీల మధ్య తలెత్తిన రాజాకీయ పోరులో రైతులు బలైపోతున్నారని అఖిల పక్షనేతలు ఆవేదన వ్యక్తం చేసారు.

బీజేపి, టీఆర్ఎస్ వైఖరితో రైతులకు నష్టం.. ధాన్యం కొనుగోలులో డ్రామాలు ఆపాలన్న అఖిలపక్షం
ఒక వైపు రాష్ట్రంలో ఖరీఫ్ వడ్ల కొనుగోలు ఇంకా పూర్తి కానే లేదని, మరొక వైపు యాసంగి వడ్లను కొనబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పాయని, రైతుల సమస్యలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలు ప్రధానమయ్యాయని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో రైతు సంక్షేమం కోసం నిలబడి, సంఘటితంగా పోరాటం చేయవలసిన అవసరం ఆసన్నమైందని, తెలంగాణ వ్యవసాయాన్ని, రైతును బతికించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు అఖిల పక్షం కొన్ని డిమాండ్లను వుంచుతోంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అఖిలపక్షం డిమాండ్.. వడ్లు కొనకపోతే పోరాటమేనన్న కోదండరాం
వానాకాలం వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, కేంద్రం బేషరతుగా, గతంలో మాదిరిగా బియ్యం కొనుగోలు చేయాలని, మాటల యుద్ధం మాని రైతును ఆదుకోనే లక్ష్యంతో బియ్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని నిలువరించాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తోంది. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ఓటిపి పద్దతిని తొలగించి పాత పద్దతిలోనే ధాన్యం కోనాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సామావేశంలో నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని, యాసంగి వడ్లను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది అఖిల పక్షం.

రాష్ట్ర ప్రభుత్వానికి పది డిమాండ్లు.. ఆమోదించకపోతే నిరసన తప్పదన్న అఖిలపక్షం
అంతే కాకుండా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, అఖిల పక్షం నిర్ధారించిన డిమాండ్ల సాధన కొరకు ఆందోళన చేపట్టాలని అఖిలపక్షం నిర్ణయించింది. వచ్చే మంగళ వారం నాడు కొనుగోలు కేంద్రాల సమీపంలో రాస్తా రోకో, లేదా కొనుగోలు కేంద్రాలలో దీక్షలు చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకోసం జిల్లా స్థాయిలో అన్నీ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కార్యాచరణను అమలు చేయాలని సూచించినట్టు అఖిల పక్షనేతలు స్పష్టం చేసారు.
Recommended Video

అఖిలపక్షం దీక్షలు,నిరసనలు.. దాన్యం కొనేంత వరకూ తగ్గేది లే అంటున్న కోదండ రాం
ఆ తర్వాత 9-12-2021 నాడు రైతుల ధర్మాగ్రహ దీక్ష ఉదయం 10గంటలనుంది మధ్యాన్నం 2 గంటల వరకు హైదరాబాదులో జరుగుతుందని, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతులను, ప్రజలను అఖిల పక్షం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత కోదండ రాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్వి చాడా వెంకట్ రెడ్డి, న్యూ డెమొక్రసీ నేత పోటు రంగారావు, న్యూ డెమొక్రసీ నాయకులు సాదినేని వేంకటేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ బీసి విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీష్ తో పాటు ఇంటి పార్టీ నేత చమార సందీప్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications