ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం: మేము సైతం అంటున్న హెచ్పీఎస్ పూర్వ విద్యార్థులు
కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కనిపించని మహమ్మారితో ఎవరూ ఎవరికి కాకుండా పోయారు. ఈ మాయదారి మహమ్మారి ఎంతో మంది అమాయకులను బలితీసుకుంది. భారత చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. ఎవ్వరినీ వదలడం లేదు. కాస్త అజాగ్రత్తతో వ్యవహరించామంటే కరోనా కాటుకు బలికావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభం బంధాలను బంధుత్వాలను తెంచేసింది. చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం వేరుచేసింది. ఈ సమయంలోనే కొందరు మానవత్వం ప్రదర్శిస్తూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. సమాజంలో తమ వంతు పాత్రను బాధ్యతాయుతంగా పోషిస్తున్నారు. విరాళాల సేకరణ ద్వారా ఈ కష్ట కాలంలో నలుగురికి సహాయం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో కూడా కరోనా కేసులు బాగానే ఉన్నాయి. ఇక తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అయితే సరైన సదుపాయాలు లేక కరోనా బారిన పడ్డవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అలాంటి వారిని ఆదుకునేందుకు వారికోసం సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు హైదరాబాదులోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్ బేగంపేట పూర్వ విద్యార్థులు ఒక్కటయ్యారు. చేయి చేయి కలిపారు. ఓ వైపు సమాజం బాధ్యత తీసుకుంటూనే మరో వైపు తమ స్నేహం ఎంత గొప్పదో చాటి చెప్పారు. 1994 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కరోనా సమయంలో పలువురికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఉన్న బొమ్మలరామారం ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఈ పూర్వ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా పలు పరికరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్కు అందజేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కూడా హైదరాబాదు పబ్లిక్ స్కూలు పూర్వ విద్యార్థి కావడం విశేషం. వీరంతా ఫ్రంట్లైన్ వారియర్స్కు కావాల్సిన పలు పరికరాలను అందజేశారు.
స్కూలు బోర్డింగ్ పూర్వ విద్యార్థులంతా కలిసి లక్ష రూపాయలు సేకరించి ఆ మొత్తంతో 40 పల్స్ ఆక్సిమీటర్లు, 10 బీపీ ఆపరేటర్లు, వెయ్యి సర్జికల్ మాస్కులు, 15 లీటర్లు శానిటైజర్, 15 లీటర్ల హైపో క్లోరైట్ సొల్యూషన్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు విరాళంగా అందజేశారు. ఇక ఈ పరికరాలు లేకపోవడంతో బొమ్మలరామారంలో ఎవరైనా కరోనా బారిన పడితే వారి ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ తెలుసుకోవడం ఆశా వర్కర్లకు కష్టతరం అవుతోందని, ఈ ప్రాథమిక అంశాలు తెలిస్తే తప్ప హాస్పిటల్లో అడ్మిట్ చేయలేని పరిస్థితి నెలకొందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ చెప్పారు. బీపీ ఆపరేటర్లు ఇతరత్రా పరికరాలు లేనందున కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేదాటిపోతోందని ఈ క్రమంలోనే ఈ విషయమై తన స్నేహితులతో చర్చించగా వారంతా సహాయం చేసేందుకు ముందుకొచ్చారని డాక్టర్ శ్రవణ్ చెప్పారు. వారందరికీ ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆశా వర్కర్లు ఇతర సిబ్బంది ప్రతిరోజు గ్రామంలో తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నందున వారి వద్ద సరైన పరికరాలు లేవని, సరిపడా సర్జికల్ మాస్కులు లేవని ఇలాంటి ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం తమ మిత్రులు కదిలి రావడంపై డాక్టర్ శ్రవణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక సహాయం చేసిన వారిలో హైదరాబాదు పబ్లిక్ స్కూలు బేగంపేట్ 1994 బ్యాచ్కు చెందిన బోర్డర్స్ ఉన్నారు. వైవీ రమణ (ఎన్ఆర్ఐ), వంశీ పైడిపల్లి (సినీ దర్శకులు),డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి, పవన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నవీన్, ఆదిత్య రెడ్డి (ఎన్ఆర్ఐ), కె. కృష్ణకుమార్ రెడ్డి (ఎన్ఆర్ఐ) రామచంద్ర రెడ్డి, మరియు డాక్టర్ గజేందర్ రెడ్డి (ఎన్ఆర్ఐ)లు ఉన్నారు.