ఎంజీఎం.. ఎందుకిలా?: 1000పడకల ఆస్పత్రిపై పాలకుల నిర్లక్ష్యం
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ పెద్దాసుపత్రి మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి.
వరంగల్: హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ పెద్దాసుపత్రి మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. నిధుల కొరతతో దిక్కులేనిదవుతోంది. నిమ్స్ స్థాయిలో ఎంజీఎంను అభివృద్ధి పరుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.
రెండున్నరేళ్ల తర్వాత కూడా ఎంజీఎం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మరోవైపు పాలనాపరమైన పట్టు తప్పడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకంగా నకిలీ మందులను రోగులకు అందిస్తున్నారు. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు దాడి చేసి వాటిని సీజ్ చేశారు. ఎంజీఎం అభివృద్ధి కోసం క్లోాది రూపాయలు కావాలని ప్రతిపాదనలు పంపినప్పికీ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం.
నిర్లక్ష్యపు జబ్బు...
కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి ఎంజీఎంను సందర్శించి వరాల జల్లు కురిపించారు. ఆధునిక వైద్య సేవలకు అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. మంత్రి వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. తప్ప నిధుల జాడ లేకుండా పోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాటి డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి కూడా అయిన డాక్టర్ టి. రాజయ్య తొలి సంతకం ఎంజీఎం అభివృద్ధికి నిధుల విడుదల ఫైలు మీదనే సంతకం చేశారు.
కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థిగా తాను ఎంజీఎం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. పిల్లల వార్డుకు సంబంధించి మాతాశిశు కేంద్రానికి రూ. 23.85 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకించారు. ఇందులో రూ. 10 కోట్లు భవన నిర్మాణం కోసం, రూ. 6 కోట్లు ఆధునిక పరికరాల కోసం, రూ. 7.85 లక్షలు సిబ్బంది నియామకం, వారి జీతభత్యాల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక పరికరాల కొనుగోలు, సిబ్బంది నియామకాల జాడే మరిచారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన రెండో నవజాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు ఇప్పటికీ కాలేదు. నిధులు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం ఎంజీఎం అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.
వెయ్యి పడకల జాడేది ...
ఎంజీఎం ఆస్పత్రిలో పేరుకే వెయ్యి పడకలు. సీజనల్ జబ్బులొస్తే ఒకే మంచంలో ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి వైద్యులు చికిత్స అందించాల్సి వస్తోంది. చాలా మంది రోగులు కింద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వెయ్యి పడకల్లో పనికి రాని మంచాలే ఎక్కువగా ఉన్నాయి. రోగులకు అందించే బెడ్షీట్ల కొరత కూడా తీవ్రస్థాయిలో ఉంది.
సిబ్బంది కొరత
ఎంజీఎం ఆస్పత్రి కేవలం రోగుల చికిత్స కోసమే కాకుండా ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు బోధానాస్పత్రిగా కూడా ఉంది. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు చాలా విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియ్ట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల నియామకాలు జరగలేదు. ప్రొఫెసర్లు 17, అసోసియెట్ ప్రొఫెసర్లు 6, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 28, హెడ్సనర్స్లు 9, స్టాఫ్ నర్స్లు 95 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర విభాగాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
ఎంసీఐ నిబంధనల మేరకు 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా ఉండాల్సిన పోస్టులు చాలా విభాగాల్లో లేవు. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఈఎన్టీ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో కొరత తీవ్రంగా ఉంది. ఎంసీఐ నిబంధనల మేరకు స్టాఫ్ పాట్రన్ లేకపోతే సీట్ల కుదింపుకు కూడా అవకాశం లేకపోలేదని వైద్యులే అంటున్నారు. ఇవి కేవలం ఉన్నత స్థాయి పోస్టులు మాత్రమే. కిందిస్థాయి పోస్టులు వందలాదిగా ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది, పరికరాల కొరతతో రోగులకు చికిత్సలెలా చేయగలమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
నిధుల లేమి ...
సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆస్పత్రిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలొస్తున్నాయి. ప్రజలను పట్టి పీడిస్తున్న క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల చికిత్స కోసం 25 ఏళ్ల కిందటే విభాగాలు ఏర్పాటు చేశారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల అవి దాదాపు మూతపడే స్థితికి చేరుకున్నాయి. క్యాన్సర్ నివారణలో ఉపయోగపడే కోబాల్ట్ యూనిట్ ఎప్పుడో అవుట్ డేట్ అయ్యింది. ఆ విభాగాల్లో ఆధునిక పరికరాల కొనుగోలు అస్పత్రి అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇక గుండె సంబంధిత జబ్బుల చికిత్స విభాగానికి చాలా కాలం నిపుణులైన వైద్యులే లేకుండా పోయారు. పదిహేనేళ్ల కిందటే అమరవాది ప్రభాకర చారి అనే వైద్యుడు ప్రత్యేక శ్రద్ధతో గుండె శస్త్ర చికిత్సలు చేశారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఆ విభాగం దాదాపు మూతపడింది.
కార్డియో థొరాసిక్ సర్జన్తో పటు గుండె జబ్బుల చికిత్స కోసం క్యాత్లాబ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఆస్పత్రి కనీస అవసరాల కోసం విడుదల చేయాల్సిన వాటిలో సర్జికల్ పరికరాలు, వార్డుల నిర్వహణ కోసం, విద్యార్థుల వసతి, నర్సింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం తదితర అవసరాల కోసం దాదాపు రూ. 11 కోట్ల నిధులు తక్షణం విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. ఏ మేరకు నిధులను విదిలిస్తుందో వేచిచూడాల్సిందే.