అమ్మాయి కోసం గొంతు కోశాడు, తట్టుకోలేకున్నా.. చనిపోతా: నిజాం కళాశాల యువతి ఫోన్
హైదరాబాద్: సికింద్రాబాదులోని చిలకలగూడలో ఘోరం జరిగింది. ఓ అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ.. చివరకు ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. ఓ విద్యార్థి గొంతును మరో విద్యార్థి కోశాడు.
చిలకలగూడలో ఉండే సాయికిరణ్, మరో విద్యార్థి డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. అదే కళాశాలలో ఓ యువతి చదువుతోంది. ఆ అమ్మాయిని ఇరువురు ప్రేమిస్తున్నారు.
నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని వారి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గురువారం కూడా ఆ అమ్మాయి కోసం ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మరో విద్యార్థి సాయి కిరణ్ పైన దాడి చేసి గొంతు కోశాడు. దీంతో సాయి కిరణ్కు తీవ్ర గాయమైంది. అతనిని స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం
హయత్ నగర్ మండలం ముంగనూరులో కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు మూడు లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైందని తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
సాగర్ శుద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
హుస్సేన్ సాగర్ శుద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోంది. సాగర్ ప్రక్షాళనకు లక్ష యూరోలను రుణంగా ఇచ్చేందుకు ఆస్ట్రియా ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరనుంది.
నిజాం కళాశాలలో ర్యాగింగ్ కలకలం
నిజాం కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాజేశ్వరి గురువారం ఈ మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి, తాను ర్యాగింగ్ను తట్టుకోలేక పోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది.
కంట్రోల్ రూం సిబ్బంది ఆమె విషయమై దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. థర్డ్ ఇయర్ చదువుతున్న రాజశేఖర్ అనే విద్యార్థి తనను వేధిస్తున్నాడని రాజేశ్వరి ఆరోపించింది.ఆమె ఫోన్ చేసిన కొద్దిసేపటి తర్వాత పోలీసులు రాజేశ్వరిని అబిడ్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు అధికారులు రాజేశ్వరి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.