స్నేహం పేరుతో 11 మంది అమ్మాయిలను ముగ్గులోకి...
స్నేహం పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని.. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిలింగ్ ద్వారా వేధిస్తున్న జగిత్యాలకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
జగిత్యాల: ముందు స్నేహం అంటాడు.. సమాజ సేవ అని కబుర్లు చెబుతాడు. ఆపైన ప్రేమ పేరుతో మెల్లగా ముగ్గులోకి దింపుతాడు.. ఆనక ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తాడు.. ఇక వాటితో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతాడు.
ఇలా.. 11 మంది అమ్మాయిలను మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆ మోసగాడి పేరు కసాయి వంశీకృష్ణ(21). జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఇతడు చదివింది ఇంటర్మీడియెట్.
జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం అమ్మాయిలను ఎంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని, చిన్న చిన్న అవసరాలు తీర్చుతూ హెల్ప్ చేసేవాడు. ఆపైన రోజూ వారితో చాటింగ్ చేస్తూ వారి వివరాలు పూర్తిగా సేకరించాడు.
వీలుచూసుకుని వారి ఫొటోలు తీసి.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. జగిత్యాల ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేయగా ఆమె రూ.3 లక్షలు ముట్టజెప్పింది. అయితే వేధింపులు మానకపోవడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పి వారి సాయంతో ఎస్పీ అనంతశర్మను కలుసుకుంది.
ఎస్పీ సూచనల మేరకు టౌన్ సీఐ ప్రకాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ బ్లాక్ మెయిలర్ బండారం బట్టబయలైంది. నిందితుడు వంశీకృష్ణ ఇలా మొత్తం 11 మంది అమ్మాయిలను మోసం చేసి లక్షల రూపాయలు రాబట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడ్ని అరెస్టు చేసి.. శుక్రవారం జగిత్యాల కోర్టుకు పంపించారు.