నిమిషం లేటు: సొంత కూతురినే అనుమతించలేదు
హైదరాబాద్: పరీక్ష నిబంధనను పాటించని తన సొంత కూతరుని ఒక ప్రిన్సిపాల్ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ కూతురు నిరాశతో పరీక్ష రాయకుండానే ఇంటిబాట పట్టింది.
హైదరాబాద్లోని నిజాం కళాశాల గేటు వద్ద నిన్న ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలో మంగళవారం లాసెట్-2015 పరీక్ష జరిగింది. లాసెట్ 2015కు పీజీ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు.

ఇంటర్ పూర్తి చేసిన వినోద్ కుమార్ కూతురు పరివర్తన ఐదేళ్ల లా కోర్సు చేసేందుకు లాసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకుంది. మంగళవారం ఉదయం 10గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు పరివర్తన (హాల్టికెట్ నెంబర్: 522020286)తో తనకు కేటాయించిన నిజాం కళాశాలకు బయలుదేరింది.
అయితే పరివర్తన కళాశాల గేటు వద్దకు చేరుకునేలోగా నిర్ణీత సమయం ముగియడంతో నిజాం కళాశాల గేటు మూసి వేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ముందే ప్రకటించారు. గేటు వద్దనే ఉన్న ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ తన కుమార్తెను పరీక్షకు అనుమతించేది లేదని చెప్పారు. దీంతో చేసేదేమి లేక పరివర్తన ఇంటిదారి పట్టారు.
ముగిసిన లాసెట్ 2015 పరీక్ష
ఐదేళ్ల లాకోర్సు ఎంట్రెన్స్ టెస్టు లాసెట్ 2015 మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. నగరంలో నిజాం కళాశాల, డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన 30మంది విద్యార్థులను నిజాం కళాశాల వద్ద వెనక్కు పంపినట్లు రీజనల్ కోఆర్డినేటర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications