వెనక్కి పంపించేసిన విద్యార్థులు మళ్లీ అప్లై చేసుకోవచ్చు: అమెరికా ఉదారత
హైదరాబాద్: అమెరికా నుంచి భారత విద్యార్థులను తిప్పి పంపలేదని, తప్పుడు వీసాలు, తప్పుడు సమాచారంతో చేరిన వారిని మాత్రమే వెనక్కి పంపించినట్లు ఢిల్లీలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ మైకేల్ పెల్లెటయిర్ చెప్పారు. చదువుల కోసం వస్తున్న వారికి అమెరికా ప్రభుత్వం ఎప్పటికీ స్వాగతం పలుకుతూనే ఉంటుందని అన్నారు.
భారతదేశం నుంచి వస్తున్న వారిలో కొందరు యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం రావడం లేదని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన సమాచారం, సరైన వీసాలు విద్యార్థులు కచ్చితంగా చూపించాల్సి ఉంటుందని చెప్పారు.
చదువుల కోసం ఒక దేశం నుంచి మరోదేశం వెళ్లడానికి విమానం, నౌకాయానం, బోర్డర్ క్రాసింగ్ సమయంలో అన్ని రకాల డాక్యుమెంట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు అనివార్యమని ఆయన అన్నారు.
అమెరికాలో చదువుకున్న విద్యార్థుల్లో 1.30 లక్షల మంది అక్కడ విజయం సాధించారన్నారు. వారంతా ప్రస్తుతం అమెరికా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్నారని చెప్పారు. చదువుల కోసం అమెరికాకు వస్తున్న వారిలో భారత విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారన్నారు. అమెరికాకు వెళ్లానుకున్న విద్యార్థులు అన్ని రకాల నియమ నిబంధనలు పాటించాల్సి ఉందని చెప్పారు.
గత రెండు నెలల కాలంలో దాదాపు 500 మంది విద్యార్థులను వెనక్కి పంపిచారు. వారిలో చాలా మంది నార్త్వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటి, సిలికాన్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందారు. విశ్వవిద్యాలయాలు ఐ20 డాక్యుమెంట్స్ ఇస్తున్నాయా లాదే అనేది ముఖ్యమని, అవి ఇస్తే బ్లాక్ లిస్టులో లేనట్లేనని పెల్లెటెయిర్ చెప్పారు.
చేతులకు సంకెళ్లు వేశారని, గదిలో బంధించారని విద్యార్థులు చేసిన ఆరోపణలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.