ప్రణయ్ హంతకుడికి ఇచ్చింది రూ.21వేలు, ఆ రోజు హత్య జరగకుంటే..! అమృతకు గవర్నమెంట్ జాబ్
Recommended Video
మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకు రూ.కోటి సుఫారీ ఒప్పందం కుదిరింది. ఇందులో ఏ 2 నిందితుడు బీహార్కు చెందిన సుబాష్ శర్మ. మారుతిరావు రూ.15 లక్షలు, ఆ తర్వాత మరో మూడు లక్షలు చెల్లించాడు. కానీ హత్య చేసిన నిందితుడికి ముట్టింది మాత్రం కేవలం రూ.21వేలు మాత్రమేనట. ఏ3 నిందితుడు అస్గర్ అలీ రూ.8 లక్షలు, ఏ4 నిందితుడు బారీ రూ.6 లక్షళు, ఏ5 నిందితుడు కరీం రూ.లక్ష చొప్పున పంచుకున్నారు.
మిగతా రూ.85 లక్షలు వచ్చాక రూ.10 లక్షలు ఇస్తామని సుభాష్ శర్మకు చెప్పారు. బీహార్లో అరెస్టు చేసిన సుభాష్ శర్మను పోలీసులు నల్గొండకు తీసుకు వచ్చారు. అతనిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇతనిని బీహార్ పోలీసుల సహకారంతో సమస్తిపూర్ పట్టణం సమీపంలోని జగత్పూర్లో పట్టుకున్నారు. గతంలో పలుమార్లు ప్రణయ్ పైన హత్యాయత్నం చేసిన వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రణయ్ హత్య: భార్యను నమ్మించిన మారుతీరావు, అమృత ఫోన్ కాల్స్ కొంపముంచాయి
14 రోజుల రిమాండ్
ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. హత్య కేసులో అరెస్టయిన మారుతీరావు, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, శ్రవణ్, కరీం, శివలను పోలీసులు బుధవారం నల్గొండ నుంచి మిర్యాలగూడకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మిర్యాలగూడ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దోషులకు అక్టోబరు 3 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నల్గొండ జైలుకు తరలించారు.
అక్రమార్జనపై విచారణ
మారుతీరావు బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయవచ్చునని ఎస్పీ ఏవీ రంగనాధ్ సూచించారు. మారుతీరావు అక్రమార్జన పైన విచారణ జరుపుతామని ఇప్పటికే వెల్లడించారు. బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని, తగిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల నుంచి రక్షణ ఉంటుందన్నారు.
ఆ రోజు హత్య జరగకుంటే పరిణామాలు మరోరకంగా
మూడు నెలల నుంచి ప్రణయ్ హత్యకు అంతకుముందు నాలుగుసార్లు విఫలమయ్యారు. దీంతో హంతకుడు సుభాష్ శర్మకు విసుగు వచ్చిందట. దీంతో శుక్రవారం (14వతేదీన) చివరి ప్రయత్నం చేస్తానని, ఆ తర్వాత విఫలమైతే వెళ్లిపోతానని చెప్పాడట. అందుకు సిద్ధమై మిర్యాలగూడలోని లాడ్జిని 13వ తేదీ రాత్రినే ఖాళీ చేశాడు. శుక్రవారం హత్య జరగకుంటే పరిణామాలు మరో రకంగా ఉండేవేవోనని భావిస్తున్నారు.
అమృతకు పరామర్శలు
ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయ భూమి ఇస్తామని తెలిపారు. అమృతకు రూ.8.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వారిని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఐ నేత చాడ వెంకటరడెడ్డి, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరాం, జనసేన పార్టీ నేత సుధాకర రావు తదితరులు పరామర్శించారు.