కవిత సభలో కలకలం: న్యాయం చేయాలని ఆత్మహత్యాయత్నం, కేసు
కరీంనగర్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం పోతవరం గ్రామంలో జరిగింది.
అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన భూవివాదం పరిష్కారం కావడం లేదని మనస్తాపం చెందిన 38 ఏళ్ల కొప్పుల సురేష్ అనే వ్యక్తి ఎంపీ కవిత సభలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. సురేష్ స్వగ్రామం బట్టపల్లి.అతని భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది.
ఈ నేపథ్యంలో సురేష్ అధికారుల చుట్టూ తిరుగుతుండగా.. కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో మనస్తాపం చెంది కవిత సమక్షంలో కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నాలు చేశారు. గమనించిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.
అతను కిరోసిన్ తీసుకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడని, పోలీసులు అతని వద్ద ఉన్న కిరోసిన్ డబ్బాను లాక్కున్నారని, అతనిని అరెస్టు చేసి సెక్షన్ 309 (ఆత్మహత్యాయత్నం) కింద బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, సమాచారం మేరకు... బాధితుడు సురేష్ పదేళ్ల క్రితం పది ఎకరాల భూమిని వెలమ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అయితే, ఆ భూమిని ఇప్పటి వరకు అతని పేరు మీద రిజిస్టర్ కాలేదని తెలుస్తోంది.