దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ బెంచ్: సీజేఐ, ఉపరాష్ట్రపతికి సౌతిండియా బార్ కౌన్సిల్ వినతి
న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల సత్వర పరిష్కరానికి దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. దక్షిణాదిలో బెంచ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్, సౌతిండియా బార్ కౌన్సిల్ కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సాధన కోసం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఛైర్మన్లతో ఏర్పడిన కమిటీ సీజేఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
Recommended Video
కక్షిదారు ఢిల్లీ వరకు రావడం ఖర్చుతో కూడుకున్నదని, ఈ విషయంపై ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరినట్లు ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తిపై సీజేఐ, ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమిళనాడు, ఏపీ, కర్ణాటక బార్ కౌన్సిళ్ల ఛైర్మన్లు పీఎస్ అమల్ రాజ్, ఘంట రామారావు, శ్రీనివాస్ బాబు, కేరళ బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ కేఎన్ అనిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ బీ కొండారెడ్డి, రామచందర్ రావు.. సీజేఐ, ఉపరాష్త్రపతిని కలిసినవారిలో ఉన్నారు.