ఏపీ, తెలంగాణ మధ్య అసహనమెందుకు: సుప్రీం, కేసీఆర్కు షాక్!
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య అసహనం వద్దని, మీ మధ్య ఎందుకు ఇంత అసహనమో మాకు అర్థం కావడం లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉద్దేశించి సుప్రీం కోర్టు సోమవారం నాడు వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నిర్వహణ కమిటీలో ఏపీ కొనసాగింపుపై వాదనలు జరిగాయి.
బాబ్లీ ప్యానల్లో ఏపీ వద్దని తెలంగాణ, మహారాష్ట్రలు సుప్రీం కోర్టులో వాదించాయి. కానీ తెలంగాణకు చుక్కెదురయింది. కమిటీలో ఏపీ ఉంటే అభ్యంతరం ఏమిటని తెలంగాణ సర్కారును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే, ఆ ప్రాజెక్టుతో ఏపీకి సంబంధం లేదని తెలంగాణతో పాటు మహారాష్ట్రలు చెప్పాయి. కానీ వారి వాదనను సుప్రీం తోసిపుచ్చింది.
బాబ్లీపై ఏపీకి ఎందుకని తెలంగాణ, మహారాష్ట్ర: హక్కుందని ఆంధ్రా
బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఏపీ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కమిటీలో ఏపీ ఉండలా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణను నిన్న (సోమవారం) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం చేపట్టింది.
మొదట తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి బాబ్లీతో సంబంధం లేదని చెప్పారు. కాబట్టి కమిటీలో ఏపీ అవసరం లేదన్నారు. మహారాష్ట్ర కూడా ఏపీని కమిటీ నుంచి తొలగించాలని కోరింది.
కమిటీ నుంచి ఏపీని మినహాయిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ వాదించింది. వాదనల అనంతరం నదీజలాల అంశంపై ఏపీ, తెలంగాణలు పరస్పరం అసహనంతో ఉన్నాయని జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వినియోగంలో దిగువ రాష్ట్రాలు సైతం భాగస్వాములేనని పేర్కొంది. కాగా, బాబ్లీ కమిటీలో ఇప్పటికే ఏపీ ఉండగా, తెలంగాణను చేర్చారు.