ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఏది!: రేవంత్ లాయర్, నిశ్చితార్థం టైంలో..
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డి డబ్బు తేలేదని, మూడో వ్యక్తి డబ్బు తెచ్చినట్లు ఏసీబీ చెప్పిందని, అలాంటప్పుడు రేవంత్ పైన కేసు ఎలా కొనసాగిస్తారని న్యాయవాది సిద్ధార్థ్ లోధా ప్రశ్నించారు.
డబ్బు తెచ్చిన మూడో వ్యక్తి మీద కేసు పెట్టాలన్నారు. మే 28వ తేదీన స్టీఫెన్ సన్ ఫిర్యాదు చేస్తే మే 31న రాత్రి పదకొండు గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. మే 31న రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే జూన్ 9న సోదాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఒకరికి లబ్ధి చేకూర్చడమన్న ప్రశ్న అధికారంలో ఉన్నవారికే వర్తిస్తుందని, అసలు ఈ కేసు ఏసీబీ స్థాయిది కాదని, పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చేదన్నారు. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలతో మానసిక హింస పెట్టాలని యత్నిస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి పైన నమోదు చేసిన సెక్షన్లు పరిగణలోకి రావని, బెయిల్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని లాయర్ కోరారు. కేసు నమోదు చేయకుండా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. కేసు నమోదు చేయకుండా దర్యాఫ్తు ఎలా సాగుతుందన్నారు. ఇందులోనే కుట్ర కోణం తెలుస్తోందన్నారు.
స్నేహపూర్వకంగా కలిశా: విష్ణు
చర్లపల్లి జైలులో రేవంత్ రెడ్డిని తాను స్నేహపూర్వకంగానే కలిశానని, ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నానని కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రేవంత్ కూతురు నిశ్చితార్థం నేపథ్యంలో ఏమైనా సాయం కావాలా అని అడిగానని, రేవంత్ క్షేమంగా బయటకు వస్తానని ధైర్యంగా చెబుతున్నారన్నారు. రేవంత్తో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడారు.