విభజన హామీలపై జోక్యం చేసుకోలేం, రాష్ట్రాలే డిమాండ్ చేయాలి: టీకి సుప్రీం స్పష్టం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రానికి సూచనలు చేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను గురువారం ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితవరాయ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విభజన చట్టం ప్రకారం కేంద్రం అనేక హామీలిచ్చిందని, 15నెలలు పూర్తయినా నెరవేర్చడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
‘మీరు బాధపడాల్సిన అవసరం లేదు. విభజన చట్టం అమలుపై కేంద్రాన్ని డిమాండ్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది' అని జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేంద్రానికి తాము సూచనలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది.

ఇది ఇలా ఉండగా, తెలంగాణలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది ప్రవేశం సాధ్యం కాదని పిటిషనర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొలుత తనకు మెడిసిన్లో సీటిచ్చి ప్రవేశ రుసుము కట్టించుకున్నారని, ఆ తర్వాత రిజర్వేషన్ లేదని నిరాకరించారని శ్రావణి అనే విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. కాగా, తెలంగాణలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయినందున పిటిషనర్కు ఈ ఏడాది ప్రవేశం కల్పించలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రవేశం కల్పించి తర్వాత నిరాకరించడం సబబు కాదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే ప్రభుత్వం వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించి పిటిషనర్ తరపు అభ్యర్థనను తిరస్కరించింది.












Click it and Unblock the Notifications