కవిత పిటీషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తొలుత- ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేయగా.. తాజాగా దాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 27వ తేదీన లిస్టింగ్ చేసినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ సారథ్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కవిత పిటీషన్ ను విచారించనుంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ అప్పట్లో కవిత తరఫు న్యాయవాది వందన సెహెగల్ పిటీషన్ వేశారు. అప్పటికప్పుడు లిస్టింగ్ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున దాన్ని నిలిపివేయాలని ఆదేశించలేమనీ తెలిపింది.

ఒక మహిళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడం సరికాదని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమనేది కవిత తరఫు న్యాయవాది వాదన. మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 11వ తేదీన గంటల తరబడి ప్రశ్నించారని గుర్తు చేశారు. కవితతో పాటు ఆమె తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడులు సాగుతున్నాయని అన్నారు.
వారిద్దరూ తమకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తోన్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఈడీతో విచారణ జరిపిస్తోందని కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకపోయినప్పటికీ-, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార రాజకీయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని అడ్డుగా పెట్టుకుని ఆమెపై రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తోన్నారని అన్నారు. దీన్ని అత్యవసర పిటీషన్ గా స్వీకరించడానికి సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని పేర్కొంది. తాజాగా ఈ తేదీని కూడా సవరించింది సుప్రీంకోర్టు. 27వ తేదీకి వాయిదా వేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications