కరోనా బారినపడిన సూర్యపేట డీఎంహెచ్ఓ ఫ్యామిలీ: జర్మనీ నుంచి కొడుకు రాక, తిరుపతికి..
హైదరాబాద్: సూర్యపేట జిల్లాలో మరోసారి కరోనావైరస్ కలకలం రేపింది. సూర్యపేట జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం కరోనావైరస్ బారినపడ్డారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్.. రెండు టెస్టుల్లోనూ ఆయనకు గురువారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఐదు రోజుల క్రితమే కోటాచలం కుమారుడు జర్మనీ నుంచి రావడం గమనార్హం.
విదేశం నుంచి వచ్చిన వెంటనే కోటాచలం కుటుంబసభ్యులంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి.. రెండ్రోజుల క్రితమే తిరిగి స్వగ్రామం చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకోగా భార్య, కుమారుడు, కోడలుతోపాటు ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా హోంఐసోలేషన్లో ఉన్నారు. కాగా, బుధవారం ఎయిడ్స్ డే సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొని వైద్య సిబ్బందికి ప్రొత్సహకాలు అందించారు డీఎంహెచ్ఓ. దీంతో వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.
ఇదిఇలావుంటే, గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 189 కరోనా కేసులు వెలుగు చూశాయి. 137 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77 మందికి వైరస్ సోకింది. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలు కరోనా బారినపడినట్లు వైద్యులు ధృవీకరించారు.
వారం రోజుల క్రితం ఆరో తరగతి విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అప్పగించి ఇంటికి పంపించారు. ఆ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు ఫోన్ చేసి తెలిపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, వైద్యులు గురువారం ఉదయం నుంచి పాఠశాలలోని 300 మంది బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలో వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. పిల్లలు కరోనా బారినపడటంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులకు కరోనా సోకిన క్రమంలో పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది. మాస్కులు ధరించడం లాంటి కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా, ఇటీవల మత్తంగి గురుకుల పాఠశాలలో 48 మంది విద్యార్థులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలోనూ 27 మంది కరోనా బారిన పడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండటంతో పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Recommended Video
మరోవైపు, తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయి.. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి... సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు. 5.90 లక్షల మంది హైదరాబాద్లో, 4.80 లక్షల మంది మేడ్చల్లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.