జనవరి ఫస్ట్లో తప్పులేదు! అందుకే క్యాలెండర్ను అనుసరిస్తున్నాం: పరిపూర్ణానంద
హైదరాబాద్: పాశ్చాత్యులు ప్రవేశపెట్టిన కొత్త సంవత్సర వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలుగు సంవత్సరాది ఉగాదిని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీ పీఠం పరిపూర్ణనంద స్వామి అన్నారు. నెక్లెస్ రోడ్డులోని జల విహార్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చదవండి: భరతమాతకు క్షీరాభిషేకం: శాతవాహన యూనివర్సిటీలో అసలేం జరిగింది?
ఇంగ్లీష్ కాలమానాన్ని అనుసరిస్తూ జనవరి ఒకటో తేదీని సంవత్సరాదిగా ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆయన అన్నారు. వేల ఏళ్ల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి, చంద్ర గమనం ఆధారంగా తిథులను రాశారని, ఆ ప్రకారం ఉగాది మాత్రమే తెలుగువారికి సంవత్సరాది అన్నారు.
జనవరి 1 వేడుకలు చేసుకోవడంలో తప్పులేదు కానీ
జనవరి ఒకటిన వేడుకలు చేసుకోవడంలో తప్పులేదని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కానీ పండుగల విషయంలో మన పద్ధతులే అనుసరణీయమన్నారు. జనవరి 1న క్యాలెండర్ మాత్రమే మారుతుందని, ప్రకృతిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
ఉగాదికి కులం, మతంతో సంబంధం లేదు
ప్రపంచ దేశాలతో కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి క్యాలెండర్ను అనుసరిస్తున్నామని, అలాగని అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆలయం తెరిచి పూజలు నిర్వహించడం ధర్మవిరుద్ధమని పరిపూర్ణానంద చెప్పారు. భారతదేశం ఎంతో విశిష్టమైందన్నారు. ఉగాదికి కులం, మతంతో సంబంధం లేదన్నారు.
క్యాలెండర్కు సంబంధించి వంద ప్రశ్నలు
తెలుగువారంతా ఉగాదిని జరుపుకోవచ్చునని పరిపూర్ణానంద అన్నారు. ఉగాది తెలుగు వారి ఉనికి అన్నారు. తెలుగులో మాట్లాడకపోతే తెలుగు వారు ఎలా కాదో, ఉగాది చేసుకోని వారు కూడా అలాగే తెలుగువారు కాదన్నారు. క్యాలెండర్కు సంబంధించి వంద ప్రశ్నలు ఉంటాయని, తిథుల్లో అలా ఉండదన్నారు.
శాతవాహన వర్సిటీ రగడపై
శాతవాహన వర్సిటీలో మనుస్మృతి ప్రతులను, భరతమాత చిత్రాన్ని కొందరు తగుబెట్టడంపై పరిపూర్ణానంద స్పందించారు. విజ్ఞానాన్ని పంచే ఎలాంటి గ్రంథాన్నయినా తగలబెట్టడం సరికాదన్నారు. మనుస్మృతిని భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కింద ఎందుకు చూడరని ప్రశ్నించారు.