పవన్ కళ్యాణ్ వెంట మాగంటి: చంద్రబాబుతో భేటీలో గ్రేటర్ ఎన్నికలపై చర్చ?
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ అంశాలతో పాటు తెలంగాణ అంశాలపైనా కీలక చర్చ జరిగే అకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ఏయే అంశాలపై ప్రస్తావించాలన్న అంశంపై ఇప్పటికే ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కామినేని, పవన్ కళ్యాణ్ ఇద్దరూ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ వెంట మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు. జనవరి 29లోపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ సైతం ప్రకటించింది.
దీంతో గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వెంట మాగంటి గోపీనాథ్ విజయవాడ వెళ్లడంపై పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. ఈ కూటమికి ఘన విజయం దక్కేలా చేశారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలు బరిలోకి దిగనున్నాయి.
ఈ రెండింటితో పాటు గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేనను కూడా కలుపుకుని బరిలోకి దిగితే ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశాలు లేకపోలేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు భేటీలో పవన్ కళ్యాణ్తో పాటు మాగంటి గోపీనాథ్ విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది.