అవి కేంద్ర పరిధిలోవి, ఆమోదింపజేయండి: బిజెపికి తలసాని సవాల్
హైదరాబాద్: ఆశావర్కర్ల వేతనాలు, పత్తికి మద్దతు ధర, ఎస్సీ వర్గీకరణ అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శలకు దిగడం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం తగదని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రాణం పోయినా పదవులు కావాలనే రకాలు కాంగ్రెస్ నేతలని, అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి, జైపాల్రెడ్డి ఎందుకు మాట్లాడలేదని మంత్రి తలసాని ప్రశ్నించారు.
బంగారు తెలంగాణ కావాలంటే..
బంగారు తెలంగాణ ఏర్పడాలంటే విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ వెస్ట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యలో తెలంగాణ వెనుకబడింది. బంగారు తెలంగాణ ఏర్పడాలంటే విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు.
జూనియర్, డిగ్రీ కాలేజీలకు కూడా సన్నబియ్యం పథకం అమలు చేస్తం. పేద దళిత, మైనార్టీ ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకున్నది. అందుకే అసహనంతో మాట్లాడుతున్నారని కడియం అన్నారు.
వరంగల్ రెఫరెండమే..
వరంగల్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి రెఫరెండమని కేంద్ర కార్మిక సహాయ శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వరంగల్ లో బీజేపీకి సానుకూల వాతావరణం చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు.