దొంగలా: ఎర్రబెల్లిపై తలసాని, తెరాసలోకి టిడిపి మాజీలు, 'తొందరపడి రాష్ట్ర విభజన'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును దొంగచాటుగా కలిసి కలవలేదని చెప్పే పరిస్థితుల్లో తాను లేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు పైన సోమవారం మండిపడ్డారు.
ఎర్రబెల్లికి దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. నాలుగు ఓట్ల కోసం తాము కుల, మత రాజకీయాలు చేయమని మంత్రి తలసాని మతోన్మాదాన్ని పెంచి పోషించిందే బిజెపి అని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం వద్ద ఓ విజన్ ఉందని చెప్పారు.
టీఆర్ఎస్లోకి ముగ్గురు టీడీపీ మాజీ కార్పోరేటర్లు
టీఆర్ఎస్ పార్టీలో.. టిడిపికి చెందిన ముగ్గురు మాజీ కార్పోరేటర్లు చేరనున్నారు. సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ కార్పోరేటర్లు తెలంగాణ రాష్ట్ర సమితీలో చేరనున్నారు. జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామా రమణా రెడ్డి, సుష్మా మధుసూదన్ రెడ్డిలు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
సెంటిమెంటుతో లబ్ధి పొందాలని: బిజెపి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెంటిమెంటుతో గెలుపొందాలని అధికార తెరాస చూస్తోందని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.
మేడారం జాతరకు 3,700 ప్రత్యేక బస్సులు: మహేందర్ రెడ్డి
మేడారం జాతరకు 3,700 ప్రత్యేక బస్సులు వేస్తున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో చెప్పారు. తమకు ఛార్జీలు పెంచే ఆలోచన ఏమాత్రం లేదని చెప్పారు. అలాగే, బస్సు డిపోలను పెంచే ప్రతిపాదన కూడా లేదన్నారు.
యూపిఏ తొందరపడి రాష్ట్ర విభజన: సీతారాం ఏచూరీ
నాడు యూపిఏ ప్రభుత్వం తొందరపడి రాష్ట్ర విభజన చేసిందని వామపక్ష నేత సీతారాం ఏచూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ విభజనను ఆయన తప్పుబట్టారు. విభజన విషయంలో యూపీఏ సర్కార్ తొందరపడిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. దేశంలో ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతోందని బిజెపిపై మండిపడ్డారు. పఠాన్కోఠ్ పైన దాడి చేసింది ఎవరో ఇప్పటి వరకు తెలియరాలేదన్నారు. అసహనం విషయంలో ఇప్పటి వరకు ఎవరి పైనా కేసులు పెట్టలేదన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే దేశంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రజా పోరాటాలతో ముందుకు పోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయారు. మంత్రులు రామమందిరం కడతామని చెప్పడాన్ని తప్పుబట్టారు. సుప్రీం కోర్టు చెప్పే వరకు ఏం చేయలేమని, ఇప్పుడు మందిరం కడతామని చెప్పడమేమిటన్నారు.