ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. చీలిపోయే పరిస్థితి లేదు: 'టాలీవుడ్ డ్రగ్స్' ఎఫెక్ట్పై తలసాని
సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోతుందన్న ప్రచారాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు.
హైదరాబాద్: టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో పరిశ్రమకు చెందిన నటీ నటులు, ఇతర టెక్నీషియన్స్ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కొంతమంది గగ్గోలు పెడుతుంటే.. మరికొంతమంది మాత్రం విచారణ తప్పేమి కాదని, ఇంతమందిలో కేవలం 12మందిని మాత్రమే వారు పిలిచారని, అది కూడా మర్యాదపూర్వకంగానే విచారిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీ చీలికకు దారి తీస్తుందా? అన్న ఊహాగానాలు కూడా బయలుదేరాయి. మరికొంతమంది మరో అడుగుముందుకేసి.. పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోతుందని ప్రచారం మొదలుపెట్టారు. అయితే అలాంటిదేమి జరగబోదని అంటున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
డ్రగ్స్ కేసుతో సినీ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధం లేదని అన్నారు. తెలుగు ఇండస్ట్రీ అంటే సిట్ విచారణకు హాజరైన 12మందే కాదని, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు. కేసు విచారణ దశలో ఉన్నందునా.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం సరికాదన్నారు. విచారణ పూర్తయ్యాక ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తామని అన్నారు.
ఇక పరిశ్రమ తరలిపోతుందన్న ఊహాగానాలకు కూడా ఆయన చెక్ పెట్టారు. అదంతా వట్టిదేనని, ఇంత మంచి వాతావరణం వదిలిపెట్టుకుని పరిశ్రమ ఇంకో చోటికి వెళ్లే అవకాశం లేదని అన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు ఉంటాయన్నారు. డ్రగ్స్ కేసుకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కూడా ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
కాగా, సిట్ విచారణను ఎదుర్కొన్న కొంతమంది సినీ ప్రముఖులు ఇండస్ట్రీలోని కొంతమంది బడా నిర్మాతలు, హీరోల పేర్లను ప్రస్తావించినట్లు ప్రచారం జరగడంతో.. చాలామందిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ తరలిపోతుందన్న వదంతులు వ్యాపించగా.. తలసాని వాటిని కొట్టిపారేశారు.