అలా వెళ్లాను అంతే: 'బాబు వద్దకు రాయబారం వెళ్లి చిక్కిన మంత్రి'పై తలసాని ఇలా..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు రాయబారం కోసం వెళ్లారని జోరుగా ప్రచారం సాగింది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు రాయబారం కోసం వెళ్లారని జోరుగా ప్రచారం సాగింది.
కమ్మ సామాజిక వర్గం కోసం కేసీఆర్
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లడం రాజకీయ కోణం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. దానిని కేసీఆర్ తప్పు అని చెప్పడం వేరే విషయం.
Recommended Video
అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు
తెలంగాణలో టిడిపి లేదని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గాన్ని తెరాస వైపుకు మరల్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో ఆదివారం భేటీ అయ్యారు.
పొత్తుల మాటలపై చంద్రబాబు ఆగ్రహం
పొత్తులపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇష్టారీతిన మాట్లాడవద్దని చంద్రబాబు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో వెళ్తామని రేవంత్ రెడ్డి అంటే, అవసరమైతే తెరాసతో లేదా బిజెపితో వెళ్తాం కానీ కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోను మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నేతలకు పొత్తులపై క్లాస్ పీకారు.
కాన్వాయ్ ఆగడంతో
ఓ వైపు తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కాగా, అదే సమయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ సీఎం ఇంటి నివాసం దారిలో వచ్చారు. చంద్రబాబు ఇంటి ముందు తలసాని కాన్వాయ్ ఆగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడకు మీడియా వెళ్లింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ట్రాఫిక్ జాం కారణంగా రోడ్డు నెంబర్ 36 వైపు వెళ్లే నిమిత్తం ఇటు వచ్చానని, చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన విషయం తనకు తెలియదని తలసాని చెప్పారు.
రాయబారం కోసం వచ్చారా?
చంద్రబాబు నివాసం వద్ద తలసాని కాన్వాయ్ ఆగడం చర్చకు దారి తీసింది. ఆయన నిజంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చారా, లేక పొరపాటున వచ్చారా అనే చర్చ సాగింది. టిడిపి - టిఆర్ఎస్ పొత్తుపై ప్రకటనలు వెలువడుతున్న సమయంలో తలసాని.. చంద్రబాబు ఇంటి వద్ద ఆగడం చూస్తుంటే ఏమైనా రాయబారం కోసం వెళ్లారా అనే చర్చ సాగింది.
చంద్రబాబును కలవలేదు
అంతేకాదు, చంద్రబాబును కలిసి ఉంటారనే ప్రచారం కూడా సాగింది. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయంత్రం స్పందించారు. చంద్రబాబును తాను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. దీనిని ఆయన ఖండించారు. ఆ దారి గుండా వెళ్లానని చంద్రబాబును మాత్రం కలవలేదని చెప్పారు.