TS Governor: తెలంగాణ గవర్నర్ మార్పుపై స్పందించిన తమిళిసై-ఎంపీగా పోటీపై క్లారిటీ !
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె స్వరాష్ట్రం అయిన తమిళనాడులోని తూత్తుకుడి సీటు నుంచి తిరిగి పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు, దీనికి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల నుంచి తప్పుకునే అవకాశమున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై ఆమె ఇవాళ స్పందించారు.

ఇవాళ సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అయోధ్య రామాలయ ద్వారాలు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై సందర్శించారు. అనంతరం గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. అదంతా ప్రచారం మాత్రమేనన్నారు. తాను తెలంగాణలోనే ఉంటానని , ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానన్నారు. ప్రజల కోసం పని చేయడానికి ఇష్టపడతానన్నారు. తాను ఢిల్లీ కి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు బీజేపీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానన్నారు.
తాను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గానే కొనసాగుతానని, ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వెల్లడించారు. తాను అసలు ఢిల్లీ వెళ్లలేదని, ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదన్నారు. తూత్తుకుడిలో వరదలు రావడంతో అక్కడ పర్యటించానని, తానేమీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నారు. అయోధ్య ద్వారాల తయారీ పరిశ్రమకు రావడం ఆనందంగా ఉందని, రాముడి ప్రతిమ చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. గవర్నర్ గా తాను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, కానీ మీడియాలో వార్తలు చూసి స్వయంగా చూడాలనిపించి ఇక్కడికి వచ్చానన్నారు.












Click it and Unblock the Notifications