దానివల్లే టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం: తమ్మినేని, ప్రజల గుండెల్లో వైఎస్: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూడల్ ఆధిపత్యం ఎక్కువైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన మెదక్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొన్నటి వరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసహనం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందన్నారు.
రాష్ట్రంలో కూడా మత అసహనం కనిపిస్తోందని, సామాజిక ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పాలన ఫ్యూడల్ ఆధిపత్యాన్ని తలపిస్తోందని, ఎస్సీలపై దాడులు జరిగినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
తెలంగాణ సెంటిమెంట్ వల్లే వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ దక్కిందన్నారు. లేకుంటే గెలవడమే కష్టంగా మారేదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలతో పాటు ప్రైవేట్ అప్పులు మాఫీ చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్: పొంగులేటి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, అయితే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యామని తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక వైఫల్యాలకు కారణాలను విశ్లేషించామని, తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు, వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందన్నారు. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.