పెంపుడు తల్లి స్వరూపకే తన్విత అప్పగింత: కోర్టు ఆదేశం
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన తన్వితను పెంపుడు తల్లి వేముల స్వరూపకు ఇవ్వాలని కొత్తగూడెం ఐదవ అదనపు మేజిస్ట్రేట్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాలసదనంలో ఉన్న తన్వితను కోర్టు ఆదేశాల మేరకు బాలసదనం అధికారులు పెంపుడు తల్లి స్వరూపకు అప్పగించారు.
మహబూబాబాద్ జిల్లాకు భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు.
అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. దీంతో స్వరూప, రాజేంద్రప్రసాద్ దంపతులు బాపుసింగ్, ఉమల నుండి దత్తత తీసుకొన్నారు.
ఈ విషయంలో ఓ ఆర్ఎంపీ మధ్యవర్తిగా వ్యవహరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే రెండేళ్ళ తర్వాత స్వరూప వద్ద ఉన్న తన కూతురిని తనకు అప్పగించాలని ఉమ ఇటీవల కాలంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో కోర్టు తన్వితను బాలసదనంలో ఉంచాలని ఆదేశించింది.
అయితే ఈ విషయమై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్వరూప దంపతులు కొత్తగూడెం ఐదో మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు పెంపుడు తల్లి స్వరూప దంపతులకు తన్వితను అప్పగించాలని బుధవారం నాడు తీర్పు చెప్పింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తన్విత పెంపుడు తల్లి వద్దే ఉంటుందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.