బండి సంజయ్ పై అసమ్మతి రాగం; బీజేపీలో ఆ నేతలకు షాక్!!
గత కొంతకాలంగా తెలంగాణ బిజెపి లోనూ బండి సంజయ్ పై అసమ్మతిరాగం కొనసాగుతుంది. బండి సంజయ్ మోనోపాలిగా వ్యవహరిస్తున్నారని, అధ్యక్షుడిగా బండి సంజయ్ ని పక్కన పెట్టి వేరొకరికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్ ని మారుస్తారని ఆశగా ఎదురుచూసిన సీనియర్లకు షాక్ ఇచ్చారు తెలంగాణ బిజెపి ఇన్చార్జి తరుణ్ చుగ్.
ఎంపీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై మాట్లాడిన బండి సంజయ్ నేరం చేస్తే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా అంటూ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బిజెపిలోని ఎంపీ ధర్మపురి అరవింద్ విభేదించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి అంటే బాధ్యత అని, ఏది పడితే అది మాట్లాడటానికి లేదని, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తప్పని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేసి బండి సంజయ్ ను వ్యతిరేకించారు. ఆపై బిజెపిలో కీలకంగా వ్యవహరించే శేఖర్ రావు వంటి నేతలు బాహాటంగానే బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి బండి సంజయ్ ని విమర్శించారు.

ఇక బండి సంజయ్ అధ్యక్షుడిగా పదవీకాలం ముగియడంతో, బండి సంజయ్ ను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని తమ నిరసన గళం వినిపించడం ద్వారా వ్యక్తం చేశారు. ఈ మేరకు అధిష్టానం వద్ద బండి సంజయ్ పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఎవరి దారిన వారు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే బండి సంజయ్ వ్యతిరేకించిన వర్గానికి తెలంగాణ బిజెపి ఇన్చార్జి తరుణ్ చుగ్ షాక్ ఇచ్చారు. 2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, అప్పటివరకు బండి సంజయ్ ని మార్చేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పట్లో కొత్త అధ్యక్షుడిని నియమించే ఆలోచన తమకు లేదని సంస్థాగత ఎన్నికల తరువాతే రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందని ప్రకటించారు. ఇక ఇదే సమయంలో త్వరలోనే విజయ్ సంకల్ప యాత్రను ప్రారంభిస్తామని, దానికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తరుణ్ చుగ్ వెల్లడించారు. తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలతో బిజెపి సేన బండి సంజయ్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళబోతుంది అన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. బండి సంజయ్ ను వ్యతిరేకిస్తున్న వర్గం మరి రానున్న ఎన్నికల సమయంలో సంజయ్ కు సహకరిస్తారా? లేదా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications