తెలంగాణ టిడిపికి షాక్: ఏపీ క్వార్టర్లో ఎర్రబెల్లి... లాగిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీకి కేటాయించిన గదులను స్పీకర్ మధుసూదనా చారి ఇతరులకు కేటాయించారు. దీని పైన తెలంగాణ టిడిపి నేతలు మండిపడుతున్నారు. స్పీకర్ నిర్ణయం పైన కోర్టుకు వెళ్లాలని వారు నిర్ణయించారు.
టీడీఎల్పీ కార్యాలయం నెంబర్ 107ను రేఖానాయక్ (ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ)కి ఇచ్చారు. గది నెంబర్ 110ని షకీల్ (మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్)కు ఇచ్చారు.
తమ గదులను ఇతరులకు కేటాయించడంపై టిడిపి నేతలు మాట్లాడతూ... తమకు నోటీసులు ఇవ్వకుండానే ఇతరులకు కేటాయించడం సరికాదన్నారు. స్పీకర్ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని, మేం ఖాళీ చేయకుండానే గదులను ఇతరులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
మరోవైపు తెరాసలో చజేరిన ఎర్రబెల్లి దయాకర రావు క్వార్టర్ విషయమై వారు మెలిక పెట్టారు. ఎర్రబెల్లికి ఏపీ క్వార్టర్సులో నివాసం ఉందని, దీనిపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, అసెంబ్లీ సెక్రటరీలతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఎర్రబెల్లికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలని కోరారు.
మాకు చెప్పకుండానా: రేవంత్
తమకు చెప్పకుండా, మేం ఖాళీ చేయకుండా వేరేవారికి ఎలా గదులు కేటాయిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అది స్పీకర్ కార్యాలయమా లేక తెరాస ఆఫీసా అని ప్రశ్నించారు. తమ హక్కులను కాపాడాల్సిన స్పీకరే ఇలా చేయడం తగదన్నారు. ఇది పైశాచిక ఆనందమని మండిపడ్డారు. ఎర్రబెల్లి అంశం తమకు సంబంధించింది కాదన్నారు.
తాను అన్ని పార్టీల నాయకులతో మాట్లాడానని, వారు ఈ చర్యను ఖండించారని చెప్పారు. దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. కాగా, రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తదితరులకు ఫోన్ చేశారు.