చంద్రబాబు వరుస నిర్ణయాలు - రేవంత్ రెడ్డికి డేంజర్ బెల్స్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాల వేగం పెంచారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు..అటు తెలంగాణాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరో ఏడాది కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తరువాత తెలంగాణ ప్రభుత్వం పైన టీడీపీ నిరసన కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పుడు పార్టీని వీడి ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తిరిగి రప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పూర్వ వైభవం కోసం టీటీడీపీ ప్రయత్నాలు
విద్యార్ధుల సమస్యల పైన టీడీపీ అనుబంధ విభాగం టీఎన్ఎస్ఎఫ్ నిరసనకు దిగింది. ఖమ్మం జిల్లా కేంద్రంగా పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు రంగం సిద్దమైంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు టీటీడీపీ ప్లాన్ చేస్తోంది. కాసాని జ్ణానేశ్వర్ అధ్యక్షతన ఎన్టీఆర్భవన్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటంతో పాటుగా బహిరంగ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవులతో పాటు ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు.
రేవంత్ కు మద్దతుగా నిలిచిన టీడీపీ శ్రేణులు
ఇప్పుడు ఈ పరిణామాలు టీ కాంగ్రెస్ లో ప్రధానంగా.. రేవంత్ వర్గంలో గుబులు రేపుతున్నాయి. తెలంగాణ టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన రేవంత్ ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు. రేవంత్ తో పాటుగా టీడీపీ వీడిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
టీడీపీ బలంగా లేకపోవటంతో తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులు రేవంత్ కు మద్దతుగా ఉంటున్నారు. రేవంత్ కు 2019లో జరిగిన మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలోనూ వారి మద్దతు లభించింది.ఒక వైపు బీజేపీ - టీఆర్ఎస్ రాజకీయంగా నువ్వా నేనా అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయం మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ మారుతున్నారు. కొందరు నేతలు రేవంత్ తో దూరం పాటిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కాంగ్రెస్ లో మరింత నైరాశ్యం కనిపిస్తోంది.
చంద్రబాబు నిర్ణయంతో రేవంత్ కు షాక్
ఈ సమయంలో..టీడీపీ తిరిగి తెలంగాణలో బలోపేతం దిశగా చేస్తున్న చర్యలు..సహజంగానే రేవంత్ కు నష్టం కలిగించే అంశంగా మారుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో తిరిగి కేడర్ లో జోష్ పెంచే కార్యక్రమాలు లేవు.
టీఆర్ఎస్ - బీజేపీ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాల పైనే కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. పొలిటికల్ గ్రౌండ్ లో కేవలం వీక్షకులుగానే మారుతున్నారు. గ్రౌండ్ పూర్తిగా టీఆర్ఎస్ - బీజేపీకి వదిలేసినట్లుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలో..అటు టీటీడీపీ ఏ మేర పుంజుకున్నా..అది కాంగ్రెస్ కే నష్టం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.