ఆపరేషన్ ఆకర్ష్: 'సంతలో పశవులను కొన్నట్లు రాజకీయ నేతలను కొంటున్నారు'
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతలో పశవులను కొన్నట్లు రాజకీయ నేతలను కొంటున్నారని ధ్వజమెత్తారు.
సచివాలయంలోనే మంత్రుల పేషీలు బ్రోకర్ కార్యాలయాలుగా తయారయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్కు కొనే చరిత్రతో పాటు, అమ్ముడుపోయే చరిత్ర కూడా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అభ్యర్థులను కేసీఆర్ కొనుగోలు చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మండిపడ్డారు.

ఈ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రారంభించిన పథకాలు కలలుగానే మిగిలిపోతున్నాయని, తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి, మహబూబ్నగర్లో టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారని ఆయన చెప్పారు. మాజీ మంత్రి విజయరామారావు టీడీపీలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిందిగా ఆ లేఖలో సీఎం కేసీఆర్ను ఆయన కోరారు.












Click it and Unblock the Notifications