ఓటుకు నోటు: సండ్ర డ్రైవర్ అఫ్జల్ పాషాపై టీ ఏసీబీ ప్రశ్నల వర్షం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కోర్టు బెయిల్ మంజారు చేసింది.
అయితే తాజాగా ఏసీబీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో రేవంత్, ఉదయ సింహ, సెబాస్టియన్లతో పాటు జెరూసలెం మత్తయ్యల ప్రమేయానికి సంబంధించిన అంశాలను ఏసీబీ ప్రస్తావించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రమేయానికి సంబంధించిన అంశాలను మాత్రం ప్రస్తావించలేదు.
తాజా సమాచారం ప్రకారం సండ్ర ప్రమేయానికి సంబంధించి అనుబంధ చార్జీషీట్ దాఖలుకు ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసులో సండ్ర పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఏసీబీ అధికారులు పడ్డారు.
ఇందులో భాగంగా శుక్రవారం సండ్ర వెంకట వీరయ్య కారు డ్రైవర్ అఫ్జల్ పాషాను ఏసీబీ అధికారులు విచారించారు. నోటీసులు జారీ చేసి అఫ్జల్ పాషాను శుక్రవారం కార్యాలయానికి పిలిపించిన అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఓటుకు నోటు వ్యవహారం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సండ్ర, అఫ్జల్ పాషా ఫోన్ను వాడినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
గురువారం నాడు హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ గురువారం ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసు జరిగిన సమయంలో మీ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు? ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు? లాంటి ప్రశ్నలతో ఏసీబీ అధికారులు రాంబాబును విచారించారు. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి, జిమ్మిబాబు ఇప్పటికీ విచారణకు హాజరు కాలేదు.