కెసిఆర్తో ఢీ: రేవంత్రెడ్డిని అడిగినా.. వ్యూహాత్మకంగా బాబు పదవులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... తెలంగాణలో తమ ప్రత్యర్థి టిఆర్ఎస్ పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దూకుడుగా వ్యవహరించే వారికి పట్టం గట్టారని అంటున్నారు.
బుధవారం నాడు తెలంగాణ, ఏపీ, జాతీయ కమిటీలను ప్రకటించారు. ఇందులో తెలంగాణ టిడిపి ఫైర్ బ్రాండ్గా భావిస్తున్న రేవంత్ రెడ్డికి చోటు కల్పించారు. ఆయన టిడిపిలో కొన్నేళ్ల క్రితమే చేరారు. అయినప్పటికీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు.
కెసిఆర్ పైన దూకుడుగా వ్యవహరిస్తున్నందునే ఆయనకు ఆ పదవి దక్కిందనే విషయం వేరే చెప్పనక్కరలేదని అంటున్నారు. తద్వారా కెసిఆర్ పైన మరింత వాడిగా దాడి చేసే బృందంతో పార్టీ తెలంగాణ కమిటీ ఏర్పాటయిందని చెబుతున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా పదవులు ఇచ్చారంటున్నారు.
టిడిపికి బిసిలలో పట్టు ఉంది. వారిని దూరం చేసుకోకుండా ఉండేందుకు బిసి వర్గానికి చెందిన నాయకుడు ఎల్ రమణను అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ఆయనను మార్చుతారనే ఊహాగానాలు తొలుత వినిపించినప్పటికీ.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న పార్టీకి నెగిటివ్ అవుతుందనే అభిప్రాయంతో ఆయనకే మరోసారి పగ్గాలు అప్పగించారు.
తెలంగాణ శాసన సభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర రావును కూడా కొనసాగిస్తున్నారు. ఆయనను పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఇక, గత సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ గెలుపు పైన స్థానిక టిఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని రైతు విభాగం అధ్యక్షునిగా నియమించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో... స్థానికంగా మంచి పట్టు ఉన్న టిడిపి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేతిలో కెసిఆర్ ఓడిపోవడం ఖాయమని టిడిపి వర్గాలు చెప్పాయి. అయితే, కెసిఆర్ ఓడిపోకపోయినప్పటికీ ఒంటేరుకు స్థానికంగా ఉన్న బలం దృష్ట్యా కెసిఆర్ మెజార్టీ భారీగా తగ్గిస్తారని అందరు అభిప్రాయపడ్డారు.
చీప్ లిక్కర్ వ్యతిరేక పోరాటంలో క్రియాశీలకంగా ఉన్న శోభారాణిని తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కొనసాగించారు. మోత్కుపల్లి నర్సింహులు పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.
బిసి నేత దేవేందర్ గౌడ్ను కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీకి తెలంగాణలో ఊపు తెచ్చే విధంగా రేవంత్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించాలని చాలామంది చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. అయితే, అన్ని రకాలుగా ఆలోచించి ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు.