జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసిన టిడిపి నేతపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: పార్టీ తెలంగాణ బాధ్యతలు హీరో జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని డమాండ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ నేతపై వేటు పడింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ తెలంగాణ నేతలు సీట్లు అమ్ముకున్నారని నైషథం సత్యనారాయణ మూర్తి బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.
అదే సమయంలో తెలంగాణలో టిడిపిని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్కు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఆయనపై టిడిపి అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందించింది.
జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అడిగిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. నైషథం సత్యనారాయణ మూర్తి రాంనగర్ డివిజన్ నుంచి టిడిపి, కాంగ్రెసు, బిజెపిల పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, ఆయన భార్య అడిక్మెట్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు మాగంటి గోపీనాథ్ తెలిపారు.
జిల్లా అధ్యక్షుడికి సస్పెండ్ చేసే అధికారం లేదని, పార్టీ సీనియర్ నాయకుడినైన తనను సస్పెండ్ చేసే హక్కులు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్కు లేదని సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారంనాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో వాగ్వివాదానికి దిగారు.
ఆ తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేకను ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించారు.