పొత్తు మత్తులో టీటీడిపి..! సిట్టింగ్ స్థానాల అంశంలో కూడా సైలెన్స్..!!
హైదరాబాద్ :తెలంగాణలో విపక్ష పర్టీలు పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తు వికటించకుండా ఉండేందుకు కూటమిలోని పార్టీలు సంయమనాన్ని పాటిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పొత్తు అంశంలో సున్నితంగా వ్యవహరిస్తోంది. పొత్తు ధర్మానికి లోబడి తమ సిట్టింగ్ స్థానాలను కూడా త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పొత్తు మత్తులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చిత్తవుతున్నట్టు తెలుస్తోంది.
టార్గెట్ టీఆర్ఎస్..! ఏకమవుతున్న విపక్షాలు..!!
చంద్రశేఖర్ రావు అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతుండడంతో రాజకీయ హడావిడి తారాస్థాయికి చేరుకుంటోంది. తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీకి తోడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.
అదికార పార్టీకి చెక్ పెట్టేందుకు సై...! అస్త్రాలు సిద్దం చేసుకుంటున్న కూటమి..!!
అనంతరం చెరుకు సుధాకర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీ కూడా మహాకూటమికి మద్దతు తెలిపింది. దీంతో పొత్తు విషయం కన్ఫార్మ్ అయిపోయింది. అయితే సీట్ల సర్ధబాటు విషయంలో మాత్రం నేటికీ క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను తీసుకుని మిగిలిన పార్టీలకు తక్కువ సీట్లు ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ నుంచి రోజుకో వార్త బయటికొస్తుంది. అందులోని నేతలు కావాలనే ఇలా లీకులు చేస్తున్నారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కూటమిలో ఆచితూచి అడుగులు వేస్తున్న పార్టీలు..!
కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పడి దాదాపు నెల రోజులు గడిచినా సీట్ల సర్దుబాట్లు ఇంతవరకు కొలిక్కి రాకపోవడంపై భాగస్వామ్య పార్టీల్లో అసంతృప్తి రాజుకుంది. ఇప్పటికే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఈ విషయంపై బహిరంగంగానే మాట్లాడారు. వీలైనంత త్వరగా సీట్ల సర్ధుబాటు చేయడం మంచిదని, తాము బలంగా ఉన్న స్థానాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు, సీపీఐ కూడా తన స్వరాన్ని వినిపిస్తోంది. తాము కోరిన సీట్లు ఇవ్వకపోతే కూటమిలో నుంచి బయటికైనా వస్తామని ఆ పార్టీలోని కొందరు నేతలు అల్టిమేట్టం జారీ చేస్తున్నారు.
సీట్లు డిమాండ్ చేయలేకపోతున్న టీడిపి..! సొంత సీట్ల త్యాగం చేసేందుకు సిద్దం..!!
కూటమిలోనే మరో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ మాత్రం నోరు మెదపడంలేదు. మహాకూటమి ఏర్పాటులో కాంగ్రెస్ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా బాగా కృషి చేశారు. ఈ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే టీడీపీ కూటమిలోనే ఉండేందుకు ఇష్టపడుతుందట. అందుకే సీట్ల విషయంలో కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయడంలేదని తెలుస్తోంది. గులాబీ పార్టీకి అదికారాన్ని దూరం చేయాలని లక్ష్యంతో ఉన్న టీడిపి సొంత సీట్లను కూడా బలంగా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.