రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి, కోమాలోకి వెళ్ళిన భార్య, అతివేగమే కారణమా?
హైదరాబాద్: హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళారు.అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. అతి వేగంగా వచ్చిన బైక్ మరో బైక్ ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గింజుపల్లి రాజేంద్రప్రసాద్ యాక్సెంచర్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆదివారం నాడు తన వారంతపు సెలవు కావడంతో భార్య భువనతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 లోని ఇందిరా నగర్ లోని తాను నివాసం ఉండే ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వేగంగా బైక్పై వస్తున్న విజయ్ ముదిరాజ్ అనే వ్యక్తి రాజేంద్రప్రసాద్ బైక్ ను ఢీకొట్టాడు.
అతి వేగంగా విజయ్ ముదిరాజ్ బైక్ రాజేంద్రప్రసాద్ బైక్ ను ఢీకొట్టింది. అయితే ఆయన వెంటనే బైక్ పై నుండి కిందపడి మృతి చెందాడు. రాజేంద్రప్రసాద్ హెల్మెట్ ధరించినా కానీ, ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. బైక్ వెనుక సీటులో కూర్చొన్న రాజేంద్రప్రసాద్ సతీమణి భువన తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది.
ప్రమాదానికి కారణమైన విజయ్ కూడ తీవ్రంగా గాయపడ్డాడు. అతను కూడ కోమాలోకి వెళ్ళాడు. కోమాలోకి వెళ్ళిన భువనను యశోదా ఆసుపత్రిలో చేర్చారు. విజయ్ ముదిరాజ్ ను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వీరిద్దరి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అతి వేగంగా విజయ్ నడుపుతున్న బైక్ రాజేంద్రప్రసాద్ బైక్ ను ఢీ కొట్టడం వల్ల రాజేంద్రప్రసాద్ బైక్ పై నుండి ఎగిరి రోడ్డుపై కొద్దిరూరంలో పడ్డాడు. ఈ కారణంగా రాజేంద్రప్రసాద్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు.