టెక్కీ హత్య: ఎలా జరిగింది, ప్రేమ వ్యవహారమే కారణమా?
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంజయ్ జంగ్ హత్యకు గల కారణాలు తెలియడం లేదు. పక్కా ప్రణాళిక ప్రకారం, ఆరితేరిన దుండగులు అతన్ని సికింద్రాబాదులో హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన 25 ఏళ్ల టెక్కీ సంజయ్ జంగ్ సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన సురేందర్, జయమ్మ అనే దంపతుల కుమారుడు. అతడు మాదాపూర్లోని సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అనే సంస్థలో పనిచేసేవాడు.
బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఇంటర్ చదువుతున్న ఓ అంధ విద్యార్థికి సహాయకుడిగా (స్ర్కైబ్) పరీక్ష రాశాడు. పరీక్ష అనంతరం రెండో షిఫ్టు డ్యూటీకి వెళ్లి అక్కడి నుంచి సహోద్యోగి కుశాల్కర్తో కలిసి మియాపూర్లో ఉండే సిద్దాంత్ రూమ్కు వెళ్లాడు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీ చేసుకున్న తర్వాత సిద్దాంత్ బైక్పై సంజయ్ను పంజాగుట్ట చౌరస్తా వద్ద కుశాల్కర్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత ఓ క్యాబ్లో వెళ్లిన సంజయ్ ప్యారడైజ్ వద్ద పికప్ చేసుకోవాల్సిందిగా బేగంపేట్లోని మరో మిత్రుడు భాస్కర్కు ఫోన్చేశాడు. ఉదయం 5:15 గంటల ప్రాంతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద కారు దిగిన సంజయ్ను నలుగురు వ్యక్తులు నెట్టుకుంటూ తీసుకెళ్లారు.
Also Read: సికింద్రాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య
స్వప్నలోక్ కాంప్లెక్స్ రెండో గేటు వద్ద ఓ వ్యక్తి సంజయ్ను కత్తితో గుండెల్లో పొడిచేశాడు. వెంటనే ట్యాంక్బండ్వైపు రాంగ్రూట్లో స్విఫ్ట్కారులో 150- 160 కిలోమీటర్ల అమిత వేగంతో నలుగురు దుండుగలు పరారయ్యారు. పెట్రోలింగ్ పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నించినా ఆ వేగాన్ని అందుకోలేకపోయారు.
ఆ తర్వాత హత్య చేసి పారిపోతున్నారని గ్రహించి పోలీసులు కంగుతిన్నారు. హత్య తీరును పరిశీలించిన పోలీసులు ప్రొఫెషనల్ హంతకులైతేనే ఇంత పకడ్బందీగా హత్య చేస్తారని అనుమానిస్తున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టి ఫాలో అయ్యే హత్య చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దుండగులు పారిపోయిన స్విఫ్ట్ కారు నంబరును 8055గా గుర్తించిన పోలీసులు ఆ నంబరు గల 14 స్విఫ్ట్ కార్ల యజమానులను పోలీసులు పిలిపించి వివరాలు సేకరించారు.
కాగా, హత్యకు గల కారణాలేంటో తెలియరాలేదు. ప్రేమ వ్యవహారం కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల క్రితం సదర్లాండ్ కంపెనీలో చేరిన సంజయ్కు ఓ యువతితో పరిచయం ఏర్పడిందని పోలీసులు గుర్తించారు. ఇక, సహోద్యోగులతో తలెత్తిన గొడవలు హత్యకు దారితీశాయా? అన్న దానిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్వప్నలోక్ వద్ద ఒక్కనెలలో జరిగిన రెండో హత్య ఇది. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నగరంలో లక్ష నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెబుతున్న ఉన్నతాధికారులు అధ్యయనానికి మహాంకాళి పోలీసుస్టేషన్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద 42 సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. నిందితులు ఎస్డీ రోడ్ నుంచి ప్యారడైజ్ చౌరస్తా, ఎంజీ రోడ్, కర్బల మైదాన్ నుంచి వెళ్ళగా ఏ సీసీ కెమెరాలోనూ ఆ కారు పూర్తినంబర్ కనిపించలేదని సమాచారం.